ప్రో కబడ్డి 2019: తెలుగు టైటాన్స్ కు తప్పని ఓటమి... ఉత్కంఠ పోరులో దబాంగ్ డిల్లీ విజయం
తెలుగు ప్రేక్షకులను టైటాన్స్ జట్టు మరోసారి నిరాశపర్చింది. డిల్లీ దబాంగ్ జట్టుతో సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో తెలగు టైటాన్స్ జట్టు కేవలం 1 పాయింట్ తేడాతో ఓటమిపాలయ్యింది.
హోం టౌన్ తో సొంత ప్రేక్షకుల మధ్య ఆడుతున్నప్పటికి తెలుగు టైటాన్స్ కు పరాజయాలు తప్పడంలేదు. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమిని చవిచూసిన టైటాన్స్ జట్టు ఇవాళ డిల్లి దబాంగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఓడింది. ఆరంభంలో ఆధిక్యాన్ని ప్రదర్శించిన టైటాన్స్ సెకండాఫ్ లో మాత్రం అదే ఆటతీరును కనబర్చలేకపోయింది. దీంతో డిల్లీ జట్టు పుంజుకోవడంతో మ్యాచ్ హోరాహోరీకి దారితీసింది. ఇలా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో డిల్లీ జట్టు విజయాన్ని అందుకుంది.
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ఇరు జట్టు చివరి నువ్వా నేనా అన్నట్లుగా పోరాడాయి. ఇలా చివరకు 33-34 పాయింట్లతో కేవలం ఒక్క పాయింట్ వ్యత్యాసంతో టైటాన్స్ పై డిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా డిల్లీ జట్టుకు మరో విజయం సాధించగా టైటాన్స్ మూడు మ్యాచుల్లో ఓటమిపాలయ్యింది.
డిల్లీ రైడర్స్ లో నవీన్ కుమార్ మాయ చేశాడు. అతడు ఏకంగా 15 పాయింట్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మిగతావారిలో చంద్రన్ రజిత్ 6, జోగిందర్ సింగ్ 4, రవిందర్ 3, మేరాజ్ 2, విజయ్ 1 పాయింట్ సాధించాడు. ఇలా కేవలం రైడింగ్ లోనే డిల్లీ ఏకంగా 24 పాయింట్స్ సాధించగా ట్యాకిల్స్ లో కేవలం 7 పాయింట్స్ మాత్రమే లభించాయి.
ఇక టైటాన్స్ జట్టులో సూరజ్ దేశాయి ఏకంగా 18 పాయింట్స్ తో అదరగొట్టినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇక సిద్దార్థ్ కూడా 8 పాయింట్లతో అదరగొట్టినా ఫలితం లేకుండా పోయింది. మిగతా ఆటగాళ్లలో విశాల్ 4, అమిత్ 2, ఫహద్ 1 పాయంట్ సాధించారు.
మ్యాచ్ చివర్లో ఇరు జట్టు సమానమైన పాయింట్లు సాధిస్తూ సాగడంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అయితే డిల్లీ జట్టు కాస్త జాగ్రత్తగా ఆడుతూనే పాయింట్స్ రాబట్టడంతో టైటాన్స్ జట్టు 33-34 పాయింట్స్ స్వల్ఫ తేడాతో ఓడిపోయింది.