కౌంటీలకు కోహ్లీ డుమ్మా: నిజంగా గాయమేనా.. మరేమైనా...
గాయం కారణంగా కౌంటీల్లో ఆడాలనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లాన్ దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది.
ముంబై: గాయం కారణంగా కౌంటీల్లో ఆడాలనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లాన్ దెబ్బ తిన్నట్లు కనిపిస్తోంది. ఇంగ్లాండు పర్యటనలో రాణించేందుకు ఆయన ముందుగానే అక్కడికి వెళ్లి కౌంటీలు ఆడాలని అనుకున్నాడు. సర్రీ జట్టు తరఫున కౌంటీలు ఆడేందుకు సమాయత్తమయ్యాడు.
కానీ, ఇప్పుడు కౌంటీలకు ఆడే పరిస్థితి లేదని అంటున్నారు. వెన్నుముకలో తీవ్రమైన నొప్పి కారణంగా కౌంటీలు ఆడేందుకు వెళ్లకూడదని కోహ్లీ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.. వెన్నుముకలో నొప్పి కారణంగా ముంబైలోని ఓ ఆర్థోపెడిక్ వైద్యుణ్ని కోహ్లీ ఇటీవల కలిశాడనే ప్రచారం జరిగింది.
వెన్నెముకలోని డిస్క్ కదలడం వల్లనే నొప్పి వస్తోందని వైద్య పరీక్షల్లో తేలినట్లు చెబుతున్నారు. అయితే దీనికి శస్త్రచికిత్స అవసరం లేదని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారట.
అయితే, డిస్క్ కు సంబంధించిన వ్యవహారం కాదని, మెడ కాస్తా బెణికిందని బిసిసిఐ వర్గాలంటున్నాయి. పనిభారం వల్ల అలా జరిగి ఉంటుందని చెబుతున్నారు. పనిభారాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అయితే, కౌంటీలు ఆడేందుకు మాత్రం విరాట్ కోహ్లీ వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు.
ఫిట్నెస్ పై ప్రభుత్వ విసిరిన సవాల్ కు జవాబిస్తూ విరాట్ కోహ్లీ ట్విటర్ లో ఓ వీడియో పోస్టు చేసాడు. ఈ వీడియో నిన్న తీసిందేనని, అందువల్ల డిస్క్ సమస్యతో విరాట్ కోహ్లీ బాధపడుతున్నాడని చెప్పడానికి వీల్లేదని బిసిసిఐ వర్గాలంటున్నాయి.
జైపూర్ లో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐపిఎల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మెడ బెణికిందని, దాని వల్ల పుట్టిన నొప్పి వెంటనే తగ్గిందని, అయితే ముందు జాగ్రత్తలో భాగంగానే కోహ్లీ సర్జన్ వద్దకు వెళ్లాడని చెబుతున్నారు.