రాజకీయాల్లోకి ధోనీ, గంభీర్..?
ధోనీకి ఉన్న ఆదరణ ద్వారా జార్ఖండ్లో పార్టీ పుంజుకోవడంతో పాటు.. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా.. దక్షిణాదిన ఎక్కువ ప్రచారం చేయించుకోవాలని బీజేపీ ఆశిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ లు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ నేతలు.. ధోనీ, గంభీర్ లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లోపు ఈ ఇద్దరు క్రికెటర్లను తమ పార్టీలో చేర్చుకుని కనీసం కొన్నిచోట్లయినా.. ప్రచారం చేయించుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ధోనీ, గంభీర్తో కమలనాథులు చర్చలు జరిపారని.. న్యూఢిల్లీ ఎంపీ సీటు గంభీర్కి ఇచ్చేందుకు పార్టీ సముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం న్యూఢిల్లీ నియోజకవర్గం ఎంపీగా ఉన్న మీనాక్షి పనితీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఆమెకి వచ్చే ఏడాది ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కుదరదని ఇప్పటికే పార్టీ చెప్పినట్లు సమాచారం. మరోవైపు ధోనీకి ఉన్న ఆదరణ ద్వారా జార్ఖండ్లో పార్టీ పుంజుకోవడంతో పాటు.. దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా.. దక్షిణాదిన ఎక్కువ ప్రచారం చేయించుకోవాలని బీజేపీ ఆశిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మరి ఈ ఇద్దరు క్రికెటర్లు.. నిజంగా రాజకీయాల్లోకి వస్తారా లేదా.. అన్న విషయం పై క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.