Asianet News TeluguAsianet News Telugu

ఫైనల్‌లో స్పెయిన్‌ని చిత్తు చేసిన టీమిండియా... వుమన్స్ నేషన్స్ కప్ విజేతగా భారత్...

FIH నేషన్స్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌పై 1-0 తేడాతో గెలిచిన భారత మహిళా హాకీ జట్టు...  ఎఫ్‌ఐహెచ్ హాకీ వుమెన్స్ ప్రో లీగ్‌కి నేరుగా అర్హత...

India Women's Hocket team Wins FIH Nations Cup 2022 title beating Spain in final
Author
First Published Dec 18, 2022, 9:35 AM IST

టోర్నీ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం కోల్పోయినా భారత మహిళా వుమెన్స్ టీమ్ అద్భుత ఆటతీరుతో వరుస విజయాలతో దూసుకుపోతోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలిచిన భారత మహిళా జట్టు, తొలిసారి నిర్వహించిన వుమెన్స్ ఎఫ్‌ఐహెచ్ హానీ నేషన్స్ కప్ టైటిల్ గెలిచింది...


స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన ఈ టోర్నీలో  8 దేశాలు పాల్గొన్నాయి. పూల్ ఏలో స్పెయిన్, ఐర్లాండ్, ఇటలీ, దక్షిణ కొరియా ఉండగా వీటిల్లో స్పెయిన్, ఐర్లాండ్ జట్లు సెమీ ఫైనల్‌కి అర్హత సాధించాయి. పూల్ బీలో ఇండియా, జపాన్, చిలీ, దక్షిణా ఆఫ్రికా ఉండగా భారత్‌తో పాటు జపాన్ సెమీస్ చేరింది. గ్రూప్ స్టేజీలో మూడుకి మూడు విజయాలు అందుకున్న జట్టుగా నిలిచిన టీమిండియా... సెమీ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్‌లో విజయం సాధించి ఫైనల్ చేరింది...

సెమీస్‌లో పూర్తి సమయం ముగిసే సమయానికి ఇరుజట్లు చెరో గోల్ సాధించాయి. పెనాల్టీ షూటౌట్‌లో 2-1 తేడాతో విజయం అందుకుని ఫైనల్ చేరింది భారత జట్టు. ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌పై 1-0 తేడాతో విజయం అందుకుంది భారత మహిళా జట్టు...

ఆట ప్రారంభమైన ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ని చక్కగా వాడుకున్న భారత ప్లేయర్ గుర్‌జీత్ కౌర్ గోల్ చేసి భారత జట్టుకి 1-0 ఆధిక్యం అందించింది. చివరి వరకూ ఈ ఆధిక్యాన్ని నిలుపుకున్న టీమిండియా, టైటిల్‌ విజేతగా నిలిచింది...

భారత్ కంటే ముందు స్పెయిన్‌కే పెనాల్టీ కార్నర్ దక్కినా భారత గోల్ కీపర్, కెప్టెన్ సవితా పూనియా అద్భుతంగా గోల్‌ని సేవ్ చేసింది. ఈ విజయంతో 2023లో జరిగే ఎఫ్‌ఐహెచ్ హాకీ వుమెన్స్ ప్రో లీగ్‌కి నేరుగా అర్హత సాధించింది భారత జట్టు. ఈ లీగ్‌లో భారత జట్టు ప్రదర్శన ఆధారంగా వచ్చే ఏడాది జరిగే ఆసియా గేమ్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది...

‘హాకీ నేషన్స్ కప్ 2022 గెలిచిన టీమ్‌లో సభ్యులుగా ఉన్న ప్లేయర్లందరికీ హాకీ ఇండియా తలా రూ.2 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. అలాగే సహాయక సిబ్బందికి తలా రూ.1 లక్ష రివార్డుగా దక్కనుంది..’ అంటూ హాకీ ఇండియా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది..

ఈ టోర్నీలో మొత్తంగా 20 మ్యాచుల్లో 50 గోల్స్ సాధించగా అందులో టీమిండియా నుంచి గుర్‌జీత్ కౌర్ రెండు గోల్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత ప్లేయర్ల బ్యూటీ డంగ్ డంగ్, ఉదితా దుహాన్, దీప్ గ్రేస్ ఎక్కా, నవ్‌నీత్ కౌర్, సంగీతా కుమారి, సోనికా తండి, సలీమా తీటే టోర్నీలో ఒక్కో గోల్ సాధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios