లార్డ్స్కు రెయిన్ లార్డ్ అడ్డు.. చివరికి గంట కూడా మోగలేదు
ఐదు టెస్టుల టెస్ట్ సిరీస్లో భాగంగా లార్డ్స్లో జరగాల్సిన రెండో టెస్ట్కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. తొలి రోజు ఆట ప్రారంభానికి ముందు నుంచే జల్లులు కురుస్తుండటంతో మైదానం చిత్తడిగా మారిపోయింది
ఐదు టెస్టుల టెస్ట్ సిరీస్లో భాగంగా లార్డ్స్లో జరగాల్సిన రెండో టెస్ట్కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. తొలి రోజు ఆట ప్రారంభానికి ముందు నుంచే జల్లులు కురుస్తుండటంతో మైదానం చిత్తడిగా మారిపోయింది. దీంతో కనీసం టాస్ కూడా వేయలేదు.. ఇరుజట్లు తుది 11 మంది ఆటగాళ్లను ప్రకటించలేదు కూడా.. అయితే లంచ్ సమయానికి ముందు, టీ వేళకు వర్షం ఆగినట్లు కనిపించింది.
దీంతో అంపైర్లు పిచ్ను పరిశీలించి... మ్యాచ్ నిర్వాహణపై చర్చించారు. మ్యాచ్ జరిగే పరిస్థితులు లేవని తేల్చడంతో... తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. మిగతా రోజుల్లో సమయాన్ని అరగంట ముందుకు జరిపి.. 96 ఓవర్ల చొప్పున మ్యాచ్ను నిర్వహించనున్నారు. 2001 తర్వాత వర్షం కారణంగా లార్డ్స్ ఒక్క బంతి కూడా పడకుండా టెస్ట్ మ్యాచ్ ఒక రోజు ఆట రద్దవ్వడం ఇదే తొలిసారి.
మరోవైపు మ్యాచ్ జరగడానికి ఐదు నిమిషాల ముందు భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గంట మోగించాల్సి వుంది. అయితే వర్షం కారణంగా తొలి రోజు ఆట రద్దవ్వడంతో అది సాధ్యం కాలేదు. 1983లో ఇదే గ్రౌండ్లో కపిల్ డేవిల్స్ జగజ్జేతగా ఆవిర్భవించింది.. ఈ చారిత్రక సంఘటనను ఆధారంగా తీసుకుని కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.