ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాయాది పాకిస్తాన్ టీమ్ను చిత్తుగా ఓడించి భారత టీమ్ అభిమానులకు పండుగను తెచ్చిపెట్టింది. 4-0 స్కోర్తో మ్యాచ్ ఆసాంతం ఇండియా ఆధిపత్యాన్ని ప్రదర్శించి ఘన విజయాన్ని నమోదు చేసింది.
చెన్నై: దాయాది దేశం పాకిస్తాన్ను భారత్ చిత్తుగా ఓడంచింది. చెన్నై వేదికగా జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2023 ఫైనల్ గ్రూప్ స్టేజ్ హాకీ మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమ్ ఇండియా తన ప్రతాపం చూపించింది. గ్రూప్ స్థాయిలోని తుది పోరులో పాకిస్తాన్ పై 4-0 స్కోర్తో విజయకేతనం ఎగరేసింది. చెన్నైలోని మేయర్ రాధాక్రిష్ణన్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో గెలిచి భారత్ నాకౌట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిస్తే సెమీ ఫైనల్కు వెళ్లే అవకాశం ఆ టీమ్కు ఉండేది. కానీ, పాకిస్తాన్ ఆశలపై నీళ్లు పడ్డట్టయింది.
ఈ మ్యాచ్లో తొలి అర్థభాగంలోనే ఇండియా టీమ్ స్కిప్పర్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశారు. థర్డ్ క్వార్టర్లో గుర్జన్ సింగ్ ఒక స్కోర్తో ఇండియా 3-0తో మంచి ఆధిపత్యంలో ఉన్నది. మ్యాచ్ చివరిలో మరో ఐదు నిమిషాల్లో ముగియనుండగా మందీప్ సింగ్ గోల్ చేసి స్కోర్ బోర్డుపై తన పేరు లిఖించుకున్నాడు.
ఫస్ట్ క్వార్టర్లో భారత్ ఇంకా స్కోర్ చేయకమునుపే పాకిస్తాన్కు ఓ గోల్ అవార్డ్ చేశారు. కానీ, రివ్యూ చేసిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
దాయాది దేశంపై జరిగిన ఈ మ్యాచ్ను క్రీడాభిమానులు ఎంజాయ్ చేశారు. భారత్ గెలుపును అభిమానులు వేడుక చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది.
