నార్వే చెస్ 2025లో గుకేష్ మాజీ ఛాంపియన్ కార్ల్సెన్ను ఓడించి చరిత్ర సృష్టించాడు. క్లాసికల్ టైమ్ కంట్రోల్లో ఇదే అతని తొలి విజయం.
భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేష్ నార్వే చెస్ 2025లో తన కెరీర్లో ఓ మైలురాయిని అధిగమించాడు. ఆరొ రౌండ్లో అతడు ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సెన్పై విజయం సాధించాడు. ఇది గుకేష్ కెరీర్లో క్లాసికల్ టైమ్ కంట్రోల్లో కార్ల్సెన్పై వచ్చిన తొలి గెలుపు కావడం విశేషం.
ఇప్పటికే ఐదు సార్లు..
మాజీ ప్రపంచ ఛాంపియన్ కార్ల్సెన్ ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచ విజేతగా నిలిచాడు. టోర్నమెంట్ ప్రారంభం నుంచే గుకేష్కి బలమైన సవాల్ విసిరిన కార్ల్సెన్, ఆరొ రౌండ్లో మాత్రం గుకేష్ ఎదుట తడబడిపోయాడు. ఎండ్గేమ్ సమయానికి 34 ఏళ్ల కార్ల్సెన్ చేసిన ఒక చిన్న తప్పిదాన్ని గుకేష్ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఫలితంగా ముగింపు దశలోనే గేమ్ను తనవైపు తిప్పుకున్నాడు.
కేవలం ఒక్క పాయింట్…
ఈ గెలుపుతో గుకేష్ మూడు విలువైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని స్కోరు 8.5 పాయింట్లు కాగా, రెండో స్థానంలో ఉన్న అమెరికన్ గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరువానాకు కేవలం ఒక పాయింట్ తక్కువగానే ఉన్నాడు. ఈ విజయం గుకేష్ను నార్వే చెస్లో మూడో స్థానానికి తీసుకువచ్చింది.
రెండో భారతీయ టీనేజర్..
ఇది నార్వే చెస్లో కార్ల్సెన్ను ఓడించిన రెండో భారతీయ టీనేజర్ విజయం. గత సంవత్సరం ప్రజ్ఞానంద కార్ల్సెన్ను ఓడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గుకేష్ అదే విజయాన్ని పునరావృతం చేశాడు.
అయితే గేమ్ ఓడిపోవడాన్ని మాగ్నస్ కార్ల్సెన్ తట్టుకోలేకపోయాడు. తన ఓటమిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ బోర్డుపై పిడికిలి బిగించాడు. అతని ఈ ప్రవర్తన సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. అభిమానులు కార్ల్సెన్కు ఇది తగిన ప్రవర్తన కాదని, క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
అయినా, ఆట ముగిశాక కార్ల్సెన్ రెండు సార్లు గుకేష్ను అభినందించి, క్షమాపణలు చెప్పడం గమనార్హం. ఈ ఘటన గుకేష్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.