చేతులెత్తేసిన ఇండియా: ఇంగ్లాండుపై సిరీస్ పరాజయం
మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఇంగ్లాండుపై ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ను పోగొట్టుకుంది. నాలుగో టెస్టు మ్యాచులో విజయావకాశాలను సరిగా వాడుకోలేక చేతులెత్తేసింది. నాలుగో టెస్టు మ్యాచులో ఇంగ్లాండుపై 60 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది.
సౌతాంప్టన్: మరో టెస్టు మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ ఇంగ్లాండుపై ఐదు టెస్టు మ్యాచుల సిరీస్ ను పోగొట్టుకుంది. నాలుగో టెస్టు మ్యాచులో విజయావకాశాలను సరిగా వాడుకోలేక చేతులెత్తేసింది. నాలుగో టెస్టు మ్యాచులో ఇంగ్లాండుపై 60 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్ ను 3-1 తేడాతో కోల్పోయింది.
నాలుగో టెస్టు మ్యాచులో మొయిన్ అలీ బంతులకు భారత్ బ్యాట్స్ మెన్ విలవిలలాడారు. నాలుగో రోజు ఆదివారం 245 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 69.4 ఓవర్లలో 184 పరుగులకు కుప్పకూలింది. విరాట్ కోహ్లీ (58), రహానె (51) అర్ధ సెంచరీలతో నాలుగో వికెట్కు 101 పరుగులు జత చేయడం తప్ప చెప్పుకోవాల్సిందేమీ లేదు.
అంతకుముందు ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 96.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. నాలుగో రోజు తొలి బంతికే బ్రాడ్ వికెట్ను షమి తీశాడు. ఆ తర్వాత కర్రాన్ (46) రనౌట్ కావడంతో తమ ఓవర్నైట్ స్కోరుకు ఆ జట్టు 11 పరుగులే చేయగలిగింది.
విజయం కోసం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ఆది నుంచీ తడబడుతూ వచ్చింది.. 22 పరుగులకే టాప్ ఆర్డర్ పెవిలియన్లో కూర్చుంది. ఈ దశలో జట్టును కెప్టెన్ కోహ్లీ, రహానె ఆదుకున్నారు. ధావన్ (17), రాహుల్ (0), పుజారా (5) పేలవమైన షాట్లతో అవుటయ్యారు.
భారీ షాట్లకు వెళ్లకుండా రహనే,త కోహ్లీ నిదానంగా ఆడుతూ స్కోరు పెంచారు.కోహ్లీ 114 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 51వ ఓవర్లో బంతి కోహ్లీ గ్లోవ్స్కు తగిలి షార్ట్ లెగ్లో కుక్ చేతిలో పడింది. దీంతో నాలుగో వికెట్కు 101 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
టీ విరామం తర్వాత భారత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోనే పాండ్యాను స్టోక్స్ అవుట్ చేశాడు. రిషబ్ పంత్ (18) అలీకి చిక్కాడు. ఆత్మవిశ్వాసంతో ఆడుతున్న రహానెను కూడా కొద్దిసేపటికే అలీ ఎల్బీ చేయడంతో భారత్ 4పరుగుల వ్యవధిలో 3 వికెట్లను కోల్పోయింది. ఆఖరి వికెట్కు అశ్విన్ (25) పోరాటం కనబరిచినా ప్రయోజనం లేకుండా పోయింది.