Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్ 2022: సాథియన్ జ్ఞానశేఖరన్‌కి కాంస్యం... ఆఖరి రోజు పతకాల పంట...

బ్యాడ్మింటన్ కాంస్య పతక పోరులో విజయం అందుకున్న సాథియన్ జ్ఞానశేఖరన్... 58కి చేరిన భారత కామన్వెల్త్ పతకాల సంఖ్య...

Commonwealth Games 2022: Table Tennis Player Sathiyan Gnanasekaran wins Bronze medal
Author
India, First Published Aug 8, 2022, 5:16 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆఖరి రోజు భారత్‌కి పతకాల పంట పండుతోంది. ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన భారత్‌కి టేబుల్ టెన్నిస్‌లో సాథియన్ జ్ఞానశేఖరన్ కాంస్యాన్ని అందించాడు. బ్రిటీష్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ 74వ ర్యాంకర్ పాల్ డ్రింక్‌హాల్‌తో జరిగిన మ్యాచ్‌ని 4-3 తేడాతో విజయం సాధించాడు సాథియన్...

మొదటి గేమ్‌ని 11-9తో సొంతం చేసుకున్న సాథియన్ జ్ఞానశేఖరన్‌, రెండో గేమ్‌ని 11-9, మూడో గేమ్‌ని 11-5 తేడాతో సొంతం చేసుకున్నాడు. 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యం సాధించిన సాథియన్, మరో గేమ్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్ వన్‌‌సైడెడ్‌గా ముగిసేది. అయితే నాలుగో గేమ్‌ నుంచి పాల్ డ్రింక్‌హాల్ ఊహించిన విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన పాల్ డ్రింక్‌హాల్, 3-3 తేడాతో మ్యాచ్‌ని ఆసక్తికరంగా మలిచాడు. దీంతో డిసైడర్ సెట్ వరకూ సాగింది ఫైనల్ మ్యాచ్. ఆఖరి గేమ్‌ని సొంతం చేసుకున్న సాథియన్ జ్ఞానశేఖరన్‌ కెరీర్‌లో మొట్టమొదటి కామన్వెల్త్ సింగిల్ మెడల్‌ని సాధించాడు...  సాథియన్ జ్ఞానశేఖరన్‌ మెడల్‌తో భారత కామన్వెల్త్ పతకాల సంఖ్య 58కి చేరుకుంది.. 

 అంతకుముందు బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ 42వ ర్యాంకర్, మలేషియా షట్లర్‌ టీ యంగ్ ఎన్‌జీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19-21, 21-9, 21-16 తేడాతో వరుస విజయం అందుకున్న లక్ష్యసేన్... స్వర్ణం సాధించాడు.

లక్ష్యసేన్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ మెడల్. తొలి సెట్‌ని 19-21 తేడాతో పోరాడి ఓడిన లక్ష్యసేన్, ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో కమ్‌బ్యాక్ ఇచ్చి వరుస సెట్లలో మలేషియా షెట్లర్‌ని చిత్తు చేశాడు. లక్షసేన్ దూకుడుకి టీ యంగ్ తలొగ్గాడు.

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు, తన ప్రత్యర్థి కెనడాకి చెందిన మిచెల్ లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుని మ్యాచ్‌ని సునాయాసంగా ముగించింది... 

మొదటి గేమ్‌ని 21-15 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో గేమ్‌లోనూ అదే దూకుడు చూపించింది. 21-13 తేడాతో రెండో గేమ్‌ని మ్యాచ్‌ని ముగించేసింది. 

2014 కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్ లీ చేతుల్లో పరాజయం పాలైన పీవీ సింధు, ఆ ఏడిషన్‌లో కాంస్య పతకం గెలిచి సరిపెట్టుకుంది. 

20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 57 పతకాలు ఉన్నాయి. ఐదో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 19 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలతో 48 పతకాలు ఉన్నాయి. 
వరల్డ్ నెం. 13 ర్యాంకర్ మిచెల్ లీని గత ఆరు మ్యాచుల్లో ఓడించిన పీవీ సింధు, అదే దూకుడుని కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌లోనూ చూపించింది. 2014 గాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్‌లో రజతం గెలిచిన పీవీ సింధుకి సింగిల్స్‌లో ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ స్వర్ణం. 2018 మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన పీవీ సింధు, ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజతం గెలిచింది. మొత్తంగా కామన్వెల్త్‌ గేమ్స్‌లో పీవీ సింధుకి ఇది ఆరో మెడ్. ఇందులో మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్య పతకం ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios