ఆసియా పారా గేమ్స్ 2023 : భారత్కు మరో స్వర్ణం.. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో గోల్డ్ కొట్టిన అంకుర్
భారతదేశానికి చెందిన అంకుర్ ధామా 2023 ఆసియా పారా గేమ్స్లో రెండవ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల 1500 మీటర్ల T11 ఫైనల్లో అంకుర్ మొదటి స్థానంలో నిలిచాడు.

భారతదేశానికి చెందిన అంకుర్ ధామా 2023 ఆసియా పారా గేమ్స్లో రెండవ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల 1500 మీటర్ల T11 ఫైనల్లో అంకుర్ మొదటి స్థానంలో నిలిచాడు. అంతకుముందు రోజు, పురుషుల జావెలిన్ F64 విభాగంలో సుమిత్ యాంటిల్ బంగారు పతకాన్ని గెలుచుకోవడంతో భారతదేశం మెడల్స్ వేటలో వేగాన్ని పెంచినట్లయ్యింది. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో హానీ స్వర్ణం సాధించింది.
కాగా.. ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో భారత బృందం అంచనాలకు మించి రాణిస్తోంది. మొదటి రెండు రోజుల్లోనే ఇండియా 35 పతకాలు సాధించి ఔరా అనిపిస్తోంది. ఆసియా పారా గేమ్స్ పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదవ స్థానంలో వుండగా.. ఇలాగే జోరు కొనసాగిస్తే.. త్వరలోనే టాప్ 3కి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
పోటీల తొలి రోజు సోమవారం 6 స్వర్ణాలతో పాటు 17 పతకాలతో శుభారంభం చేసింది భారత్. రెండో రోజు మంగళవారం మూడు పసిడి సహా 17 పతకాలు భారత్ తన ఖాతాలో వేసుకుంది.ఇప్పటివరకు 9 స్వర్ణాలతో సహా మొత్తం 34 పథకాలు భారత్ సొంతం చేసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు కూడా ఈ ఆటల్లో తమ సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆటగాడు రవి రొంగలి షాట్ పుట్ లో రజతం సాధించాడు. ఎఫ్ 40 కేటగిరీలో రవి గుండును 9.92 మీటర్ల దూరం విసిరి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణ అట్లేట్ జీవాంజి దీప్తి పారా ఆసియా క్రీడల్లో అదరగొట్టింది. మహిళల టీ20 400 మీటర్ల పరుగులో ఆసియా క్రీడలు, పారా ఆసియా క్రీడల రికార్డును బద్దలు కొట్టింది. 56.69 సెకండ్లలో నిర్ణీత పరుగును పూర్తి చేసి స్వర్ణ పథకం కైవసం చేసుకుంది దీప్తి. . ఈ పోటీ మంగళవారం జరిగింది.