Asian Athletics Championships: 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రెండో రోజు భారత్ 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో గోల్డ్ మెడల్ సహా 8 పతకాలు గెలుచుకుంది.
Asian Athletics Championships: 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ అదరగొడుతోంది. రెండో రోజు కూడా అద్భుత ప్రదర్శన చేసింది. బుధవారం జరిగిన వివిధ ఈవెంట్లలో మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. 4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో బంగారం పతకం సాధించడం విశేషం. అలాగే, అనేక వ్యక్తిగత రజత పతకాలు, ఒక కాంస్య పతకంతో భారత మెడల్స్ సంఖ్య పెరిగింది.
4x400 మీటర్ల మిక్స్డ్ రిలేలో గోల్డ్ మెడల్
రూపాల్ చౌదరి, సంతోష్ కుమార్, విశాల్ టికె, సుభా వెంకటేశన్ లతో కూడిన భారత 4x400 మీటర్ల మిక్స్డ్ రిలే జట్టు అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టు 3:18.12 సెకన్లలో టార్గెట్ ను అందుకుని గోల్డ్ మెడల్ గెలిచింది. రూపాల్ చౌదరి మహిళల 400 మీటర్ల ఈవెంట్లో రజత పతకం సాధించింది. సుభా వెంకటేశన్ 2023 ఎడిషన్లో కూడా బంగారు పతకం సాధించిన మిక్స్డ్ రిలే జట్టులో భాగంగా ఉన్నారు.
చైనా, శ్రీలంక జట్లు రెండవ, మూడవ స్థానాల్లో నిలిచినప్పటికీ, వారు అనర్హతకు గురయ్యారు. దీంతో కజకిస్తాన్ (3:22.70 సెకన్లు), కొరియా (3:22.87 సెకన్లు) రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నాయి.
రజత, కాంస్య పతకాలతో భారత్ కు మరింత ఊపు
తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో 7618 పాయింట్లతో రజత పతకం సాధించాడు. ప్రవీణ్ చిత్రవేల్ పురుషుల ట్రిపుల్ జంప్లో 16.90 మీటర్లతో రజతం గెలుచుకున్నాడు.
మహిళల 400 మీటర్ల ఫైనల్లో రూపాల్ చౌదరి 52.68 సెకన్లలో రజత పతకం సాధించింది. మహిళల 1500 మీటర్లలో పూజ 4:10.83 సెకన్లలో రజతం గెలుచుకుంది. పురుషుల 1500 మీటర్లలో యూనస్ షా 3:43.03 సెకన్లలో కాంస్యం సాధించాడు.
పురుషుల 10,000 మీటర్లలో గుల్వీర్ సింగ్ బంగారు పతకం సాధించాడు. సెర్విన్ సెబాస్టియన్ 20 కి.మీ. రేస్ వాక్లో కాంస్యం గెలుచుకున్నారు.