Asianet News TeluguAsianet News Telugu

గ్రహపాట్లు, పొరపాట్లు: కరోనాపై పోరులో జగన్ వీక్, కారణాలివే...

ప్రజల దృక్పథంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు కరోనాపై పోరును విజయవంతంగా నడుపుతున్నట్టుగా అనిపించడం మాత్రం లేదు. ఇలా ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచిస్తే... ఒక అయిదు కారణాలు బలంగా కనబడతాయి. 

YS Jagan Loosing the perception Battle in the fight against Coronavirus
Author
Amaravathi, First Published Apr 28, 2020, 4:14 PM IST

కరోనా వైరస్ మహమ్మారికి వాక్సిన్ వచ్చే వరకు అది మనందరి మధ్య ఉండడం అనేది తథ్యం. దానితోపాటుగానే మనం బ్రతక్కడం అలవాటు చేసుకోవాలి. సోషల్ డిస్టెంసింగ్ అనే లక్ష్మణ రేఖను దాటకుండా ఈ మహమ్మారితో సహజీవనం చేయాలి. 

ఈ విషయం చెప్పింది స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థ. లాక్ డౌన్ ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి మార్గం కాదు అన్న విషయం కూడా నిరూపితమైంది. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ వైరస్ ఎవ్వరికైనా రావొచ్చని, ఈ వైరస్ సోకిన వారిని ఏదో దుష్టులుగా, దుర్మార్గులుగా, అంటరానివారిగా చూడాల్సిన అవసరం లేదని, వీరికి తెలియకుండా వచ్చిందని, రేపు పొద్దున తనకు కూడా ఈ వైరస్ సోకొచ్చని అన్నారు. 

కరోనా వైరస్ సోకినవారిపట్ల ఒకరకమైన ద్వేష భావాన్ని మిగిలిన వాళ్ళు పెంచుకుంటున్న వేళ... ఆయన మాట్లాడిన తీరు ప్రశంసనీయం. ఇకపోతే జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వైరస్ పై పోరాటం సాగిస్తున్నప్పటికీ కూడా ఆయన మాత్రం ఈ కరోనాపై పోరులో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో పేరు రావడం లేదు. పేరు రాకపోతే రాకపోయింది. కరోనా పై పోరులో వెనక బడ్డట్టుగా అనిపిస్తుంది. 

టీడీపీ సోషల్ మీడియా వింగ్ ప్రచారం ఇది అని అనిపించొచ్చు. కానీ వైసీపీకి కూడా సోషల్ మీడియా వింగ్ బలంగానే ఉంది. ప్రశాంత్ కిషోర్ టీం ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారి వద్ద పని చేస్తూనే ఉన్నారు. 

అయినా కూడా ప్రజల దృక్పథంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు కరోనాపై పోరును విజయవంతంగా నడుపుతున్నట్టుగా అనిపించడం మాత్రం లేదు. ఇలా ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచిస్తే... ఒక అయిదు కారణాలు బలంగా కనబడతాయి. 

మొదటగా... స్థానిక సంస్థల ఎన్నికల అంశం. జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఈ లాక్ డౌన్ కి ముందు ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ తో ఏ లెవెల్ లో బహిరంగ యుద్ధానికి దిగిందో అందరికి తెలిసిన విషయమే. 

లాక్ డౌన్ విధించిన తరువాత కూడా ఆ విషయాన్నీ సద్దుమణిగేలా చేయకుండా, ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రమేషే కుమార్ పై కక్ష సాధింపు చర్య అనిపించేలా ఆయనను తొలిగిస్తు ( పదవి కాలం ముగిసింది, ఆ వాదనలను కొద్దీ సేపు పక్కన పెడితే) ఆదేశాలను జారీ చేసింది. 

ఇలా రమేష్ కుమార్ తొలిగింపు వల్ల ఒక రకమైన ఇమేజ్ మాత్రం వైసీపీ మీద క్రియేట్ అయింది. ఈ కరోనా మహమ్మారి కన్నా ఎన్నికలు, ఎన్నికల ప్రధానాధికారి మీద చర్యలు తీసుకోవడమే ప్రధాన అజెండాగా మారాయి అని ప్రతిపక్షాలు ఇటు బీజేపీ నుంచి అటు టీడీపీ వరకు దుమ్మెత్తి పోస్తున్నాయి. దీనికి రంగుల రాజకీయం అదనం!

ఇక రెండవ అంశం అధికార పక్ష నాయకుల లాక్ డౌన్ ఉల్లంఘనలు. అధికార పక్ష నాయకులు యథేచ్ఛగా లాక్ డౌన్ లను ఉల్లంఘిస్తున్నారు. ట్రాక్టర్ ర్యాలీలు మొదలు పూలు చల్లడం వరకు ఇలా అన్ని కార్యక్రమాలను హంగు ఆర్భాటాలతో చేస్తున్నారు నాయకులు. 

సత్తెనపల్లిలో యువకుడు మందులు తీసుకురావడానికి బయటకు వెళితే చావబాదిన పోలీసులు తెల్లారి రోజా లాక్ డౌన్ ఉల్లంఘనను యథేచ్ఛగా చేస్తూ యావత్ ఆంధ్రప్రదేశ్ గొంతు తడుపుతున్నాను అన్నట్టుగా బోర్ పంపును ప్రారంభించడం తీవ్ర విమర్శకులకు కారణమైంది. 

ఇక మూడవది లాక్ డౌన్ ను ఎత్తివేయాలన్న ప్రభుత్వ ఆలోచన. ఏపీలో కేసులు ఒక పక్క పెరుగుతున్నప్పటికీ కూడా అది టెస్టింగ్ వల్ల మాత్రమే అంటూ, లాక్ డౌన్ ని ఎత్తివేసేందుకు ఎప్పటి నుండో కూడా జగన్ ప్రభుత్వం సుముఖంగా ఉంది. మొదటి సారి విధించిన లాక్ డౌన్ ను పొడిగించేప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కారు అయిష్టంగానే అంగీకరించింది. కేంద్రం ఆదేశాల వల్ల ఒప్పుకోవలిసి వచ్చింది. 

నాలుగవ అంశం వైద్యుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం. తమకు కిట్లు అందడం లేదు అని వైద్యులు అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ రోడ్లెక్కారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణాలో తమకు కిట్లు లేవని జూడాలు బిచ్చమెత్తుకొని విరాళాలు సేకరించారు కూడా. 

అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో కిట్లు లేవు, మాస్కులు తక్కువగా ఉన్నాయి అని అన్నందుకు అధికారులను, డాక్టర్లను సస్పెండ్ చేయడం ఒక  ఎత్తయితే.... వారిపైన రాజకీయంగా దాడి చేయడం మరో ఎత్తు. 

ఇక అన్నిటికంటే ప్రధానమైనది ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం. కేసీఆర్, జగన్ ఇద్దరు ఒకే సారి పారాసిటమాల్ వ్యాఖ్యలు చేసారు. తానేదో ప్రజల్లో మనోధైర్యం నింపడానికి అన్నట్టుగా కేసీఆర్ తన తెలివితో, వాక్చాతుర్యంతో ఆ సమస్య నుంచి గట్టెక్కాడు. 

కేసీఆర్ ఆ వ్యాఖ్య చేసాక ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి రోజు ప్రెస్ మీట్లు పెట్టడం నుంచి మొదలు ప్రజలకు నేనున్నాననే కాంఫిడెన్స్ ను కల్పించాడు.సోషల్ మీడియా నుంచి బయట రోడ్లమీద వరకు జనాలు మాట్లాకడుకుంటూ, "కరోనా కి కరెక్ట్ మొగుడు కేసీఆర్" అనే మాటలు వాడుతున్నారు అంటేనే ఆయనపట్ల ఉన్న కాంఫిడెన్స్ ను మనం అర్థం చేసుకోవాలి. 

ఆ విషయంలో మాత్రం జగన్ వైఫల్యం కనబడుతుంది. ఆయన ప్రెస్ మీట్లను కూడా ఇప్పుడు డైరెక్ట్ గా నిర్వహించకుండా రికార్డెడ్ వీడియోను విడుదల చేస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష టీడీపీ విరుచుకుపడుతుంది. 

వారు జగన్ సర్కార్ వైఫల్యం అంటూ చేస్తున్న ప్రచారానికి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సొంతగా చేసిన ఈ అయిదు తప్పులు మరింతగా ఊతమిస్తున్నాయి. అసలు ప్రతిపక్షం పూర్తిగా కుదేలయిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఈ కరోనా వైరస్ దెబ్బకు రాజకీయ వేడి బాగా పెరిగిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios