Asianet News TeluguAsianet News Telugu

ఉండవల్లి 'అద్దె' ఇంటిపై చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు?

చంద్రబాబు నివాసంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే పోరాటం చేస్తూ వస్తోంది. మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాన్ని అక్రమ నిర్మాణమంటూ పోరాటం చేస్తూ వస్తున్నారు.

Why Chandrababu perticular about Undavalli residenc?
Author
Amaravathi, First Published Aug 16, 2019, 6:19 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత మూడు రోజులుగా హైదరాబాదులోనే ఉంటున్నారు. ఆయన సొంత నివాసం కూడా హైదరాబాదులో ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనను అమరావతి నుంచే కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన అక్కడకు మారారు. ఈ సమయంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

చంద్రబాబు నివాసం ఉంటున్న నివాసం వరద తాకిడికి మునిగిపోతుందని ప్రభుత్వాధికారులు చెబుతూ, ఖాళీ చేయాలని సిబ్బందిని హెచ్చరించారు కూడా. అయితే, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాకు దిగారు. నిజానికి, చంద్రబాబు ఆ నివాసాన్ని అద్దెకు తీసుకున్నారు. అద్దె ఇంటిపై ఇంత రాద్ధాంతం ఎందుకనేది ప్రశ్న. డ్రోన్లతో నిఘా పెడుతున్నారనే ఆరోపణలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి.

చంద్రబాబు నివాసంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే పోరాటం చేస్తూ వస్తోంది. మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాన్ని అక్రమ నిర్మాణమంటూ పోరాటం చేస్తూ వస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా నిర్మించిన ప్రజా వేదికను ప్రభుత్వం కూల్చివేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని సమావేశాలకు వాడుకునే వారు. అంటే ప్రజా దర్బారుగా పనిచేస్తూ వచ్చింది. 

ప్రజా వేదిక కూల్చివేత తర్వాత చంద్రబాబు అద్దెకు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను కూల్చివేస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. కానీ, కోర్టు జోక్యం కారణంగా అది నిలిచిపోయిందని భావించడానికి వీలుంది. అయినప్పటికీ చంద్రబాబు ఆ ఇంటిని చంద్రబాబు చేత ఖాళీ చేయించాలనే పట్టుదల మాత్రం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను వీడడం లేదు. చి 

అమరావతికి మకాం మార్చినప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కృష్ణా నది కరకట్టపై నిర్మించిన ఉండవల్లి అతిథి గృహాన్ని చంద్రబాబు తన అధికారిక నివాసం చేసుకున్నారు. అక్రమ కట్టడాన్ని చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మాట్లాడుతూ వచ్చారు. 

జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా వేదికను కూల్చివేసిన నేపథ్యంలో చంద్రబాబు తన మకాం మారుస్తారని, తనకు నివాసయోగ్యమైన భవనాల కోసం అన్వేషిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. ఆయన అదే నివాసంలో ఉంటూ వస్తున్నారు.  కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు అ పని చేయకపోగా, అక్రమ కట్టడమైన లింగమనేని రమేష్ అతిథి గృహంలో ఉంటూ వస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. 

అయితే, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం ఆ భవనం విషయంలో పట్టువీడకపోవడంతో లింగమనేని రమేష్, చంద్రబాబు మాట మార్చారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఆ స్థలం ప్రభుత్వానిదని చంద్రబాబు చెప్పారు. ఆ భూమితో తనకు సంబంధం లేదని లింగమనేని రమేష్ చెప్పారు. 

అయితే, ఆ నిర్మాణానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో అనుమతి లభించింది. దాని గురించి ప్రశ్నించినప్పుడు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆళ్ల రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఇంత రాద్ధాంతం జరుగుతుండగా చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గానీ ఆ భవనం విషయంలో ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. 

లింగమనేని రమేష్ తో చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యం అందుకు కారణమా, జగన్ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రజలకు తెలియజెప్పడానికా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 

గతంలో లింగమనేని రమేష్ కు చెందిన నిర్మాణాన్ని అద్దెకు తీసుకున్నట్లు చంద్రబాబు చెబుతూ వచ్చారు. లింగమనేని రమేష్ కు ప్రభుత్వం నుంచి అద్దె సొమ్ము వెళ్లిందా అనేది కూడా ప్రశ్ననే. ఏమైనా, చంద్రబాబు ఆ ఇంటి విషయంలో పట్టుదలకు స్పష్టమైన కారణం మాత్రం తెలియడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios