Asianet News TeluguAsianet News Telugu

సీఎంల ర్యాంకింగ్ లో దిగజారిన కేసీఆర్: జరిగింది ఇదీ....

తమ రాష్ట్ర ముఖ్యమంత్రులపట్ల ప్రజలు ఎంతమేర సంతృప్తిగా ఉన్నారన్న విషయంలో సి ఓటర్ ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి నుండి ఎనిమిదవ స్థానంలో నిలిచారు. కేసీఆర్ లాంటి ప్రజాధారణ కలిగిన నాయకుల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరా అనే అనుమానం కలుగక మానదు. 

Telangana CM KCR Ranked One Among The Lowest In The CM Satisfaction Survey By C-Voter
Author
Hyderabad, First Published Jun 6, 2020, 4:49 PM IST

ఈ వారంలో ఒక సర్వే విడుదలయింది. మే చివర్లో జరిగిన ఈ సర్వే ఫలితాలు ఏ రాజకీయ నాయకుడికి షాక్ ఇచ్చాయో లేదో తెలియదు కానీ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం ఇది ఖచ్చితంగా తన గురించి తాను ఆత్మవిమర్శను చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. 

తమ రాష్ట్ర ముఖ్యమంత్రులపట్ల ప్రజలు ఎంతమేర సంతృప్తిగా ఉన్నారన్న విషయంలో సి ఓటర్ ఈ సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి నుండి ఎనిమిదవ స్థానంలో నిలిచారు. కేసీఆర్ లాంటి ప్రజాధారణ కలిగిన నాయకుల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరా అనే అనుమానం కలుగక మానదు. 

కేసీఆర్ కన్నా ఎందరో రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అందరికన్నా ముందుండగా, ఛత్తీస్గఢ్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. 

జగన్, కేసీఆర్ లకు పోలిక.... 

ఏపీసీఎం జగన్ పాలన పట్ల 47.5  శాతం మంది సంపూర్ణ సంతృప్తిని చెందారు. ఒక మోస్తరుగా 40.55 శాతం మంది సంతృప్తి చెందగా పూర్తి అసంతృప్తితో ఉన్నవారు 10.04 శాతం మంది మాత్రమే. 

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే... పూర్తి సంతృప్తిగా ఉన్నవారు 46.14, ఒక మోస్తరుగా సంతృప్తి చెందినవారు 29.24, పూర్తి అసంతృప్తిగా ఉన్నవారు 21.16 శాతం మంది. 

పూర్తి సంతృప్తి చెందినవారు విషయంలో ఇద్దరికి పెద్ద తేడా లేకున్నప్పటికీ.... ఒక మోస్తరు సంతృప్తి, పూర్తి అసంతృప్తుల విషయంలో జగన్ కన్నా కేసీఆర్ బాగా వెనకబడి ఉన్నారు. 

కేసీఆర్ కన్నా ఇంకో ఏడుగురు ముఖ్యమంత్రులు దిగువన ఉన్నారు కదా అని అనవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం ఊసే లేదు. అలాంటి రాష్ట్రంలో కేసీఆర్ పట్ల అసంతృప్తి ఉండడం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. 

దేశం మొత్తంలో కేసీఆర్ 16వ స్థానంలో నిలిచారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి అక్కడ టీడీపీ రూపంలో బలమైన ప్రతిపక్షం ఉంది. దానికి తోడు కొత్తగా  ఏర్పడ్డ లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం. ఇటువంటి సమయంలో కూడా జగన్ పట్ల ప్రజలకు బలమైన విశ్వాసం ఉంది. 

తెలంగాణాలో కేసీఆర్ ఎక్కడ తప్పు చేసాడు, అన్ని విషయాల్లోనూ బాగానే పరిపాలన చేస్తున్నాడుకదా అని అనిపించొచ్చు. కానీ ఇక్కడ అర్థం కావలిసిన అంశం ఏమిటంటే... కేసీఆర్ కి ప్రతిపక్షం లేకున్నప్పటికీ, కేసీఆర్ కి పోలిక కేసీఆర్ తోనే. 

కేసీఆర్ 2.0 ని కేసీఆర్ 1.0తో పోల్చి చూస్తున్నారు ప్రజలు. తొలిసారి ఆయన అనేక కార్యక్రమాలను చేసారు.  నిరంతరాయ విద్యుత్ నుంచి మొదలు కాళేశ్వరం వరకు అనేక బృహత్ కార్యక్రమాలను చేపట్టారు. ప్రజల్లో వాటివల్ల పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. 

ఇక వీటితోపాటుగా కేసీఆర్ కి మరొక అవకాశం ఇద్దామని భావించారు ప్రజలు. ప్రాజెక్టులు మధ్యలో ఉన్నాయి, తెలంగాణ అస్తిత్వ వాదం, తెలంగాణ సెంటిమెంట్ అప్పటికి ఇంకా బలంగా ఉండడం అన్ని వెరసి కేసీఆర్ కి విజయం నల్లేరు మీద నడక అయింది. భారీ విజయాన్ని అందించిపెట్టింది. వీటితోపాటుగా చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక ఇమేజ్ ప్రో తెలంగాణ ఓట్లన్నీ తెరాస వైపుగా మళ్లించింది. 

ఈ అన్ని కారణాల నేపథ్యంలో కేసీఆర్ గెలుపు, ఆయన పాపులారిటీ అప్పుడు వేరే లెవెల్ లో ఉంది 2018 డిసెంబర్ లో ఆయన గెలిచాడు. ఇప్పుడు రెండు సంవత్సరాలు గడుస్తున్నాయి. ఎప్పటికప్పుడు సర్వే లు చేపించుకునే కేసీఆర్ ఈ విషయంలో చేపించుకోలేదా అనే అనుమానం కలుగక మానదు. 

ప్రతిపక్షం లేకపోతేనే కేసీఆర్ పాలనపై ఇంత వ్యతిరేకత వస్తే... ప్రతిపక్షం ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. ఈ ప్రతిపక్షం ప్రస్తుతానికి బలంగా లేదు. కానీ ఎవరికీ తెలుసు ఎప్పుడు ఎలా పరిస్థితులు మారుతాయో. ఇప్పటికైనా కేసీఆర్ ఈ విషయంలో ఒకింత జాగ్రత్తపడితే మేలు. 

Follow Us:
Download App:
  • android
  • ios