Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రికి, తోటి పౌర సమజానికి బహిరంగ లేఖ

అదృష్టవశాత్తూ మరో నెలా రేన్నేళ్ళలో ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం సాధారణ జీవితంలోకి వస్తామనే ఆశిస్తున్నాం. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇబ్బందుల్లో ఉంటాం కావొచ్చు కూడా. అతలాకుతలం ఐన ఆర్థిక వ్యవస్థ ను దారిలో పెట్టడానికి శక్తిమేరా ప్రయత్నిస్తాం కావొచ్చు. కానీ, ఇక్కడే మరో సవాల్ ని స్వీకరించడం మంచిది. 

Open Letter to Telangana CM KCR appealing to ban on liquour
Author
Hyderabad, First Published Apr 12, 2020, 5:21 PM IST

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు  కె.చంద్రశేఖర్ రావు గారికి,  
నా తోటి సోదర సోదరీమణులకూ..ఒక మాట. శాశ్వత మద్యపాన నిషేధానికై ఒక విజ్ఞప్తి... 

కరోనా కట్టడి నేపథ్యంలో ఎవరింటికి వాళ్ళం పరిమితమైనం. బలవంతంగా నైనా దిగ్భంధనానికి గురైనం. ఈ సమయంలో తాత్కాలికంగానైనా  కొన్ని అలవాట్లు మార్చుకోక తప్పని పరిస్థితిలో పడ్డాం. మొన్నటిదాకా పరుగులెత్తిన జీవితం ఒక్కపరి నిదానించడం చూస్తున్నాం. ఇంటి వద్ద ఉండి అనేక విషయాలను తరచి చూసుకుంటూనే ఉన్నాం. మంచికో చెడుకో మన జీవన శైలిలో తగు మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభం  అయింది. ఈ తరుణంలో మరికొన్ని విషయాలు ఆలోచించడం అవసరం కూడానూ. అది ప్రకృతి విధ్వంసం గురించి కావొచ్చు, గ్లోబల్ వార్మింగ్ కావొచ్చు లేదా సామాన్య జీవితం గడపడం గురించీ కావొచ్చు. అంతకన్నా ముఖ్యమైన మరో విషయం, మన అదుపులో ఉన్న ఒక అంశం గురించి మనం మరింత బాధ్యతగా ఆలోచించడం గురించి కావొచ్చు. ఈ ఆలోచన, విజ్ఞప్తి మటుకు మన ప్రకృతిని మనం కాపాడుకోవడం గురించి. శాశ్వత మద్యపానం నిషేధం కోసం ప్రతిన  పూనడం గురించి. దాని గురించే ఈ చిన్న లేఖ. భహిరంగ విజ్ఞప్తి.

అదృష్టవశాత్తూ మరో నెలా రేన్నేళ్ళలో ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం సాధారణ జీవితంలోకి వస్తామనే ఆశిస్తున్నాం. ఆ తర్వాత కొన్నాళ్ళు ఇబ్బందుల్లో ఉంటాం కావొచ్చు కూడా. అతలాకుతలం ఐన ఆర్థిక వ్యవస్థ ను దారిలో పెట్టడానికి శక్తిమేరా ప్రయత్నిస్తాం కావొచ్చు. కానీ, ఇక్కడే మరో సవాల్ ని స్వీకరించడం మంచిది. ఇప్పటిదాకా మద్యం అమ్మకాలను నిషేధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారు లాక్ డౌన్ అనతరం మన రాష్ట్రంలో శాశ్వత మద్యపాన నిషేధం గురించి ఆలోచించడం మంచిది. వారికి ఈ విషయంలో గట్టిగా అందరం విజ్ఞప్తి చేయడానికి ఇది తగిన సమయం అనే నా భావన. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోయానా మన ముఖ్యమంత్రి గారు జీవన్మరణ సమస్య వంటి కరోనా నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నారు. ఉద్యోగుల జీతాలు దాదాపు యాభై శాతం కొత పెట్టడం వారి ముందు చూపుకు, సాహసోపేత వ్యక్తిత్వానికి ఉదాహరణ. అదే విధంగా రైతుల కోసం ముప్పయ్ వేల కోట్లను సిద్దం చేసి పంట కొనుగులుకోసం తగిన చర్యలతో సాటి లేని నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇవన్నీ హెల్త్ ఎమర్జెన్సీనేపథ్యంలో తప్పని, అనివార్య సమయంలో తీసుకున్న నిర్ణయాలే కావోచ్చు. కానీ, మొత్తం పౌర సమాజం కదలక మెదలక ఒక్క చోట, అదీ ఇంట్లో బందీ అయిన నేటి సందర్భం నిజానికి ప్రకృతి మనకు ఇచ్చిన వరం. ఇలాంటి తరుణంలో, ఒక ఆత్యయిక స్థితిని దృష్టిలో పెట్టుకుని వారు దృడంగా తీసుకుంటున్న నిర్ణయాలలో మనం అండగా ఉండాలి. అలాగే ఇదే సానుకూల సమయంగా భావించి గౌరవనీయులు మరో ఆలోచన చేయాలని కూడా చెప్పాలనిపిస్తోంది. మొత్తం సామాన్య, మధ్యతరగతి ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే మద్యపాన నిషేధంపై ఇప్పుడే వారు గట్టిగా పునరాలోచన చేయాలి. ఇది దీర్ఘకాలిక హెల్త్ ఎమర్జెన్సీగా వారు ఎంచుకోవాలి. 

ఆర్ధిక వనరుగా మద్యపానం ప్రభుత్వాలకు ఎంత పెద్ద వరమో అందరికీ తెలుసు. కానీ, అది దీర్ఘకాలికంగా సమాజ ఆరోగ్యాన్ని ఎలా పాడుచేస్తుందో ముఖ్యమంత్రి గారికి తెలియంది కాదు. కాకపోతే, సమాజం ఇప్పుడు కఠిన నిర్ణయాలను అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ గారు దృడమైన నిర్ణయం తెసుకుంటే ఎవరైనా ఒప్పుకునే పరిస్థితే ఉంటుంది. వారు సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు ఆలోచించడం కరోనా నేపథ్యంలో అందివచ్చిన అవకాశం.  సామాజిక బాధ్యత. ఇది తగిన సమయం కూడా.  

ఇప్పుడు మారే అలవాట్లు, మార్చే నిర్ణయాలు కొన్ని తరాల వరకు ఆరోగ్యవంతమైన సమాజానికి ఆదర్శంగా  ఉపకరిస్థాయి. అందుకు నడుం కట్టవలసింది అధినేతలే. అదృష్టవశాత్తూ అందుకు తగ్గ సమర్థుత గలవారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 

ఈ విషయంలో కవులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, మిగతా అందరం కూడా ముఖ్యమంత్రికి మన మనసులో ఉన్న మాట చెప్పాలి. అవసరమైన కార్యాచరణ తీసుకుని ఒత్తిడి చేయడానికి కూడా సిద్దంగా ఉండాలి. కరోనా అనంతరం మొత్తం సమాజం మద్యానికి దూరంగా ఉంచేలా గట్టి కార్యక్రమం తీసుకోవడం అటు ప్రభుత్వ విధ్యుక్త ధర్మం. ఇటు పౌర సమాజపు కనీస బాధ్యత. ఇది నా సూచన.

అదృష్టవశాత్తూ ఒక హక్కుగానే కాక బాధ్యతగా మెసిలే అవకాశం కరోనా మనకు కలిగించింది. అది ఎన్నో విధాలుగానో మనలో విప్లవాత్మకమైన చర్యలకు ప్రేరేపిస్తోంది. అందులో మద్యపాన నిషేధం ఒకటిగా జోడించడం మన చేతనకు, విప్లవ శీలతకు ఎంతో మంచిది. ఇలాంటి చర్యలు సమస్త సమాజపు ఉమ్మడి పురోగమనానికి గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. 

పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్ .జగన్ గారు ఇదివరకే ఈ దిశలో కార్యాచరణ ప్రారంభించారు. కాబట్టి ఈ విషయంలో వారు మరింత సానుకూలంగా ఉంటారనే మనం ఆశించవచ్చు. వారికి కూడా ఇదే ప్రత్యేక విజ్ఞప్తి. 

మద్యపాన నిషేధం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు  తప్పక ప్రకటిస్తారని, అందుకోసం యుద్ధ ప్రాతిపదికగా ఒక థింక్ ట్యాంక్ ఏర్పాటు చేసి, కొన్ని నెలల్లో సంపూర్ణ మద్య నిషేధానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి.

ఇప్పుడు ఏర్పాటైన క్య్యారంటైన్ కేంద్రాలు, ఆసుపత్రులు, అన్ని విధాలా సిద్దంగా ఉన్న  వైద్య సిబ్బంది, సమస్త మంత్రి మండలీ, అన్ని చర్యలూనూ  - కరోనా లాక్ డౌన్ అనతరం మద్యపాన  నిషేధం వలన గలిగే అన్ని సమస్యలనూ ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపకరిస్తాయి కూడా. 

మద్యం నుంచి వచ్చే వనరుల లేనప్పుడు ప్రభుతాల మనుగడ కోసం చేయవలసిన కసరత్తు ఈ నెల రెన్నేళ్ళు చేయడానికి ప్రయత్నిస్తే నిజంగా సమాజం బతికిపోతుంది. కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరుస్థాయి. 

ఒక సాధారణ మనిషిగానే కాక సామాన్యశాస్త్రం రచయితగా, స్వతంత్ర పాత్రికేయుడిగానూ  ఇరు రాష్ట ముఖ్యమంత్రులకు, పౌర సమాజానికి ఇదే నా వినమ్ర విజ్ఞప్తి. ఈ ఆలోచనని పలు రీతుల్లో ముందుకు తీసుకు పోవాలని, అధికార కేంద్రం ఈ దిశగా అడుగులు వేయడానికి  నా తోటి పౌరులు సహకరించవలసిందని వినయంగా కోరుతున్నాను. సంఘీభావంగా ఈ లేఖను అందరికీ చేరవేయవలసిందనీ మనవి. 

కందుకూరి రమేష్ బాబు
ఇండిపెండెంట్ జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్

Follow Us:
Download App:
  • android
  • ios