Asianet News TeluguAsianet News Telugu

ఉచిత కరెంటే కాదు, భూమి కూడా ఇచ్చాం : కేసీఆర్ సర్కార్ ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం

తెలంగాణలో ఎన్నికలకు ముందే  రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయం ‘‘కరెంట్’’ షాక్ కొడుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో(ఉమ్మడి రాష్ట్రంలో) రైతులకు ఏం చేశామనేది వివరించేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేస్తోంది.

Congress Counter BRS Over Farmers Welfare ksm sir
Author
First Published Jul 15, 2023, 5:27 PM IST

తెలంగాణలో ఎన్నికలకు ముందే  రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయం ‘‘కరెంట్’’ షాక్ కొడుతుంది. ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపిన సంగ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఇది కాస్తా ఉచిత విద్యుత్ నుంచి రైతు సంక్షేమంపై చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌ వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఎత్తివేస్తుందని బీఆర్ఎస్ ఆరోపించగా.. కాంగ్రెస్ కూడా ఎదురుదాడికి దిగుతుంది. తొలుత రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇస్తుంది. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో(ఉమ్మడి రాష్ట్రంలో) రైతులకు ఏం చేశామనేది వివరించే ప్రయత్నం చేస్తోంది.

ఉచిత్ విద్యుతే కాదు.. దుక్కి దున్నడానికి భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. రైతులకు సీలింగ్ యాక్ట్ కింద భూమిని పంచింది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక పైనే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేశారని గుర్తుచేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనని చెబుతున్నారు. దేశంలో అట్టడుగు  వర్గాల వారికి సంక్షేమం అందించిందే కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వారు వాదిస్తున్నారు. 108 అంబులెన్స్‌లు, ఆరోగ్య శ్రీ‌తో పేదలకు కార్పొరేట్ వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద విద్యార్థుల ఉన్నత చదవులకు సహకారం.. వంటి స్కీమ్‌లను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేస్తున్నారు. 

తమ పథకాలను బీఆర్ఎస్ కాపీ కొట్టి గొప్పలు చెప్పుకుంటుందని.. బీఆర్ఎస్ పాలనలో రైతులను నాణ్యమైన  విద్యుత్ అందడం లేదని రివర్స్ అటాక్ చేస్తోంది. 
రైతులు, బలహీన వర్గాల పక్షపాతిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీపై ఉచిత్ విద్యుతు విషయంలో నిందలు వేయడం తగదని చెబుతోంది. అదే సమయంలో రైతులతో పాటు పలవర్గాలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ శ్రేణులు గుర్తుచేస్తున్నారు. రైతు రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్.. ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కేసీఆర్.. ఆయనే ముఖ్యమంత్రి అయ్యారని విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు దళితుడుని సీఎం చేసే ఊసే లేదని.. కేసీఆర్ చేసేవి అన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలేనని మండిపడుతున్నారు. కేసీఆర్‌ రాజకీయం తప్ప సంక్షేమం గురించి ఆలోచన చేసే వ్యక్తి కాదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది కోసమే కేసీఆర్ దళిత బంధు స్కీమ్‌ను  తీసుకొచ్చారని విమర్శించారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని  తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 

కేసీఆర్ నిజంగా రైతు పక్షపాతి అయితే.. రైతు సంక్షేమం విషయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదనది సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.  కాంగ్రెస్ విధానంలోనే రైతు సంక్షేమం ఉందని.. సంక్షేమం అనేది కాంగ్రెస్ పేటెంట్ అని స్పష్టం చేస్తున్నారు. రైతుకు నాడు..నేడు ఏనాడైనా అండగా నిలిచేది కాంగ్రెస్ మాత్రమేనని పేర్కొంటున్నారు. ఈ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కాంగ్రెస్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios