Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వ్యూహకర్త రాబిన్ శర్మ ఔట్: రంగంలోకి ప్రశాంత్ కిశోర్ జట్టు సభ్యుడు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మను తప్పించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ప్రశాంత్ కిశోర్ జట్టులో పనిచేసిన వ్యక్తిని నియమించుకున్నట్లు సమాచారం.

Chandrabau strategist Robin Sharma out: ex PK team member hired
Author
Amaravathi, First Published Feb 22, 2022, 10:05 AM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడి వ్యూహకర్తగా రాబిన్ శర్మ తప్పుకున్నారు. రాబిన్ శర్మ తీరు పట్ల చంద్రబాబు సంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయన జట్టు పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రాబిన్ శర్మ జట్టు టీడీపీ వ్యూహాలను రచించి, అమలు చేసే బాధ్యత నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. రాబిన్ శర్మ స్థానంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) మాజీ సభ్యుడు సునీల్ కానుగోలుతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. 

కానుగోలుతో కూడా టీడీపీ మూడు నెలల కాంట్రాక్టు మాత్రమే చేసుకున్నట్లు తెలుస్తోంది. సునీల్ కానుబోలు జట్టు పనితీరుతో సంతృప్తి చెందితే కాంట్రాక్టును పొడగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ చేబ్రోలు తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కోసం పనిచేసిన జట్టులో ఉన్నారు. రాబిన్ శర్మ కూడా గతంలో పీకే జట్టు (ఐపాక్)లో పనిచేశారు. చాలా కాలంగా రాబిన్ శర్మ టీడీపీ కోసం పనిచేస్తూ వస్తున్నారు.

కాగా, ప్రశాంత్ కిశోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు కోసం, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల కోసం మాత్రం ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్షంగా పనిచేయడం లేదు. ఆయన జట్టు సభ్యులు కొంత మంది ఆమెకు సలహాలు, సూచనలు చేస్తూ వస్తున్నారు. 

టీఆర్ఎస్ విజయం కోసం ప్రశాంత్ కిశోర్ పక్కా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. మెజారిటీ ఓటర్లను చీల్చే వ్యూహరచన చేసి, దాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బిజెపి బలాన్ని పెంచే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. బిజెపిపై యుద్ధం ప్రకటించడం వెనక వ్యూహం అదేనని సమాచారం. బిజెపి, కాంగ్రెసు మధ్య ఓట్లు చీలితే టీఆర్ఎస్ విజయం సాధిస్తుందనే అంచనాతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. 

2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి తేవడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర నిర్వహించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా పీకే జట్టు సభ్యులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేస్తూ వస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని అందించడంలో, సోషల్ మీడియా పోస్టింగుల విషయంలో పీకే జట్టు వైఎస్ జగన్ ప్రభుత్వానికి తోడ్పడుతూ వస్తోంది.

సంస్థాగత నిర్మాణం విషయంలో కూడా ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ పార్టీలకు సూచనలు చేస్తూ వస్తుంది. అంతేకాకుండా ప్రజల నాడిని పట్టుకుని ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ వెళ్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ జట్టు రంగంలోకి దిగింది. వివిధ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లకు ఫోన్లు వెళ్తున్న విషయం దీన్నే నిర్ధారిస్తోందని అంటున్నారు. 

తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను అధికారంలోకి తేవడం ప్రశాంత్ కిశోర్ నిర్ణయాత్మక పాత్ర పోషించారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు పార్టీ తిరిగి అధికారం చేజిక్కించుకోవడంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహరచన ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios