Asianet News TeluguAsianet News Telugu

లైన్ క్లియర్: టి20 ప్రపంచ కప్ వద్దు, ఐపీఎల్ ముద్దు!

క్రికెట్‌ సీజన్‌ ఎక్కడ్నుంచి ఆరంభం కావాలనే చర్చ ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. దీనిపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలు ఐపీఎల్‌ దిశగా సాగేందుకు భారత క్రికెట్‌ బోర్డు వేసిన ఎత్తుగడ పక్కాగా ఫలించింది!. ఇప్పటికే ఎంతోమంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌తోనే సీజన్‌ను మొదలుపెట్టాలని అంటున్నారు.

BCCI Master Sketch: T20 World Cup Postponed, All Clear For IPL
Author
Hyderabad, First Published May 28, 2020, 9:24 AM IST

టి20 ప్రపంచ కప్ వాయిదా పడడం ఖాయం. నేడు దానిపై ఐసీసీ అధికారిక ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. నేటి మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా దాని వాయిదాపై ఒక ప్రకటన వచ్చే ఆస్కారం ఉంది. 

ఇదిలా ఉండగా క్రికెట్‌ సీజన్‌ ఎక్కడ్నుంచి ఆరంభం కావాలనే చర్చ ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. దీనిపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలు ఐపీఎల్‌ దిశగా సాగేందుకు భారత క్రికెట్‌ బోర్డు వేసిన ఎత్తుగడ పక్కాగా ఫలించింది!. ఇప్పటికే ఎంతోమంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌తోనే సీజన్‌ను మొదలుపెట్టాలని అంటున్నారు.

అన్ని బంధాలకు కేంద్రం ఆర్థిక మూలాలే అనే మౌళిక సూత్రాన్ని బీసీసీఐ తెలివిగా ఉపయోగించుకుంది. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థికంగా గట్టెక్కించే బహుళ ప్రయోజనకారి ఐపీఎల్‌ అత్యంత ముఖ్యమని భిన్న గొంతుల ద్వారా వినిపిస్తోంది. బీసీసీఐ ప్రణాళికతో టీ20 వరల్డ్‌కప్‌ రద్దు కానుండగా, అదే సమయంలో ఐపీఎల్‌2020 పట్టాలెక్కనుంది!.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కాసులు కురిపించే కల్ప తరువు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌). 2008 నుంచీ ఐపీఎల్‌ దిగ్విజయ యాత్ర కొనసాగుతోంది. అంచనాలను మించి రాణిస్తోంది. ఐపీఎల్‌ లీగ్‌ బ్రాండ్‌ విలువ, ఐపీఎల్‌ ప్రాంఛైజీల బ్రాండ్‌ విలువ కండ్లుచెదిరే రీతిలో దూసుకెళ్తోంది. బీసీసీఐకి రూ. 4 వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే, భారత ఆర్థిక వ్యవస్థకు రూ. 70 వేల కోట్ల లావాదేవీలు సమకూర్చే ఐపీఎల్‌కు ఈ ఏడాది బ్రేక్‌ పడింది. 

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ 2020 తొలుత ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది. భారత్‌లో రెండో దశ లాక్‌డౌన్‌తో ఐపీఎల్‌ను నిరవధిక వాయిదా వేశారు. తాజాగా నాల్గో దశ లాక్‌డౌన్‌లో స్టేడియాలు, క్రీడా సముదాయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్టేడియాల్లోకి, క్రీడా సముదాయాల్లోకి ప్రేక్షకుల ప్రవేశంపై మాత్రం నిషేధం కొనసాగించింది. తాజా సడలింపులతో ఐపీఎల్‌ 2020 సీజన్‌ను పట్టాలెక్కించే ప్రణాళికకు కదలిక వచ్చింది.

 అన్ని దేశాలు కూడా ఆర్థికంగా చితికిపోయి ఉన్న తరుణంలో టి20 ప్రపంచ కప్ మీద ఆశలు పెట్టుకున్నాయి. ప్రపంచ కప్ ఆడితే వచ్చే ఆదాయంతో ఆర్ధిక నష్టాలను పూడ్చుకోవచ్చు అని అన్ని టీంలు కూడా భావించాయి. కానీ ఈ తరుణంలో బీసీసీఐ తన ట్రంప్ కార్డును ప్రయోగించింది. 

బీసీసీఐ ట్రంప్‌కార్డ్‌....

ఏ దేశంలో భారత జట్టు పర్యటించినా, ఆ సిరీస్‌ నుంచి వచ్చే డబ్బు చాలా ఎక్కువ. ఐసీసీ ఆదాయం వాటాకు కనీసం ఐదు రెట్లు ఉంటుంది!. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రికెట్‌ బోర్డులతో బీసీసీఐ ఇప్పుడు ద్వైపాక్షిక దౌత్యం నెరపుతోంది. 

ఆయా దేశాల్లో పర్యటిస్తామని హామి ఇస్తోంది. భారత్‌తో సిరీస్‌ చాలా బోర్డులకు సంజీవని!. టీ20 వరల్డ్‌కప్‌ ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది జరుగుతోంది. ఆదాయ వాటా ఎప్పుడైనా ఖాతాలో పడుతుంది. కానీ బీసీసీఐ ఆఫర్‌ ఎప్పుడో కానీ రాదు. దీంతో క్రికెట్‌ బోర్డులు బీసీసీఐ ప్రణాళిక వైపు మొగ్గుచూపుతున్నాయి. 

సాంకేతికం గానూ ఎదురుకానున్న కొన్ని సమస్యలను బీసీసీఐ ముందుకు తీసుకొస్తుంది. కరోనా సమయంలో 15 దేశాల జట్లు వివిధ నగరాల్లో పర్యటిస్తూ ఓ వరల్డ్‌ టోర్నీ ఆడటం శ్రేయష్కరం కాదని కొంతమంది వాదిస్తున్నారు. అందుకు బదులుగా ఒకటి రెండు నగరాల్లో జరిగే ఐపీఎల్‌ ఉత్తమ మార్గమని సెలవిస్తున్నారు.

ఐపీఎల్‌ ఆదాయంతో బీసీసీఐ ఆర్థికంగా ఎప్పట్లాగే తిరుగులేని స్థితిలో నిలువనుంది. వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ సమయం అక్టోబర్‌-నవంబర్‌లో ఐపీఎల్‌ నిర్వహణకు మద్దతుగా నిలిచిన బోర్డులకు తన ద్వైపాక్షిక సిరీస్‌లను ఆఫర్‌ చేస్తోంది. ఐపీఎల్‌లో ఆడనున్న క్రికెటర్లకు జాతీయ జట్టు తరఫున ఏడాది పొడవునా దక్కని సొమ్ము ఒక్క ఆరు వారాల్లో (ఇప్పుడు నాలుగు వారాలకు కుదించే వీలుంది) సంపాదించుకోనున్నారు. అటు ఆటగాళ్లు, ఇటు క్రికెట్‌ బోర్డులు లాభపడే విధంగా బీసీసీఐ పక్కా ప్లాన్‌ డిజైన్‌ చేసింది.

లాక్ డౌన్ సడలింపు... చిగురించిన ఆశలు

నాల్గో దశ లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం క్రీడా సముదాయాలు, స్టేడియాలకు అనుమతి ఇచ్చింది. అభిమానులను అనుమతి లేకుండా ప్రొఫెషనల్‌ టోర్నీలకు పరోక్షంగా అనుమతి ఇచ్చింది. 

బీసీసీఐకి మరో కొన్ని కీలక అనుమతులు అవసరం. విదేశీ క్రికెటర్లు ఇక్కడికి వచ్చేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రయాణాలు పున ప్రారంభం అందులో కీలకం. వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీసీసీఐ కాంట్రాక్టు క్రికెటర్లను ఓ చోటకు చేర్చేందుకు వీలుగా దేశవాళీ విమాన ప్రయాణాలకు అనుమతి అవసరం. అది కూడా దక్కింది. విమాన సేవలు ప్రారంభమయ్యాయి. 

రాష్ట్రాల మధ్య స్వేచ్ఛా రాకపోకలను బీసీసీఐ ఆశిస్తోంది. ఈ ప్రక్రియను మరో 45 రోజుల్లో కోరుకుంటోంది. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌లో ఐపీఎల్‌2020 నిర్వహణకు మార్గం సుగమం కానుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్టులో దేశవాళీ, సెప్టెంబర్‌లో అంతర్జాతీయ విమాన సర్వీస్‌లకు పచ్చజెండా ఊపినా బీసీసీఐకి షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ నిర్వహించేందుకు వీలుంది. 

ఈ లోగా జరగాల్సిన ద్వైపాక్షిక (శ్రీలంకతో) సిరీస్‌లకు భారత్‌ ప్రయాణ ఆంక్షలను సాకుగా చూపి తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది.బీసీసీఐ వర్గాలు కూడా అదే విషయం తెలుపుతున్నాయి. మొత్తానికి బీసీసీఐ తన ప్లాన్ ను పక్కాగా అమలు చేసుకొని ఐపీఎల్ కి లైన్ క్లియర్ చేపించుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios