ఓ మట్టి గణపయ్య.. నీ వెక్కడయ్య?
- నగరవాసుల్లో అవగాహన కల్పించాలని పీసీబీ నిర్ణయించింది.
- రాయితీ ధరపై లక్ష మట్టి ప్రతిమలను ప్రత్యేక కేంద్రాల ద్వారా అందజేయనున్నట్లుగా ప్రకటించింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంలో మట్టి వినాయకుని విగ్రహాలనే అందరూ పూజించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్ నగర వాసులందరికీ 2లక్షల మట్టి గణపయ్య విగ్రహాలను కూడా పంచిపెట్టనున్నట్లు.. అధికారికంగా ప్రకటించారు. ప్రజల్లోనూ పర్యవారణ పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుతుండటంతో ప్రభుత్వ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు. ప్రకటనల వరకూ బాగానే ఉంది.. మరి ఆచరించడంలో ప్రభుత్వం విజయం సాధించిందా అంటే లేదనే చెప్పాలి.
రేపే వినాయకచవితి. కానీ.. ఎక్కడా ప్రభుత్వం అందజేస్తామని చెప్పిన మట్టి విగ్రహాలు కనిపించడం లేదు. అసలు విగ్రహాలను తయారు చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పర్యావరణహితంగా పండగని జరుపుకునేలా నగరవాసుల్లో అవగాహన కల్పించాలని పీసీబీ నిర్ణయించింది. రాయితీ ధరపై లక్ష మట్టి ప్రతిమలను ప్రత్యేక కేంద్రాల ద్వారా అందజేయనున్నట్లుగా ప్రకటించింది. డిమాండ్ను బట్టి రెండు లక్షలు అవసరమైనా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రకృతిలో లభించే వస్తువులతో సహజ రంగులను తయారు చేయించి విక్రయించనున్నట్లు వివరించింది.
విగ్రహాల తయారీ బాధ్యతని టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. సదరు సంస్థ సకాలంలోనే రంగంలోకి దిగి పని ప్రారంభించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుకున్న సమయానికే సహజ రంగులను సిద్ధం చేసింది. ఇంతవరకు అంతా బాగానే జరిగింది. పంపిణీ కేంద్రాల విషయాన్ని మాత్రం పీసీబీ అధికారులు మరిచిపోయారు. అసలు ఆ జాబితాను సిద్ధం చేశారో లేదో కూడా తెలియని పరిస్థితి. మట్టి విగ్రహాల వాడకంపై నామమాత్రంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి చేతులు దులుపుకున్నారు.విగ్రహాలను ఎక్కడ పంపిణీ చేస్తున్నారో.. అధికారులకే తెలియకపోవడం గమనార్హం.
Read more news at