వెంకయ్యనాయుడిపై వ్యాఖ్యలు: వెనక్కి తీసుకొన్న విజయసాయిరెడ్డి
రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడిపై నిన్న చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
న్యూఢిల్లీ: రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడిపై నిన్న చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.సోమవారం నాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రసంగించే సమయంలో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడిపై అనుచిత వ్యాఖ్యలను ఉపయోగించారు.
ఈ వ్యాఖ్యల విషయమై ఇవాళ పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రస్తావించారు. ఈ రకమైన వ్యాఖ్యలు సరికాదని ఆయన విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.
also read:టీడీపీ ఎంపీ కనకమేడలపై చర్యలకు డిమాండ్: వెంకయ్యకు విజయసాయి లేఖ
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ సూచన మేరకు విజయసాయిరెడ్డి స్పందించారు. తాను ఆవేశంలో ఛైర్మెన్ పై ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చెప్పారు. ఈ రకంగా వ్యాఖ్యలు చేసినందుకు తాను చింతిస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో ఈ రకమైన వ్యాఖ్యలు తాను చేయబోనని స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొంటున్నట్టుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరే సమయంలో రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడిపై విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.