పెళ్లికి నిరాకరించిందని.. నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రియుడు
తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నడిరోడ్డుపై గొంతు కోసేశాడు.
వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే.. పెళ్లికి మాత్రం యువతి కుటుంబసభ్యులు నిరాకరించారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడానికి యువతి సముఖం చూపలేదు. ప్రియుడిని మరిచిపోవాలంటూ చెప్పింది. అయితే.. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నడిరోడ్డుపై గొంతు కోసేశాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని దొడ్డబెలె రోడ్డు నివాసి అనిత (23) అనే యువతి ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. సహొద్యోగి వెంకటేశ్ మూడేళ్ల నుంచి ఆమెను ప్రేమిస్తున్నాడు. వెంకటేశ్తో పెళ్లికి అనిత కుటుంబీకులు తిరస్కరించారు. అనిత కూడా అదే మాట చెప్పడంతో వెంకటేశ్ పగ పెంచుకున్నాడు.
సోమవారం ఉదయం 7.15 గంటలప్పుడు అనిత దొడ్డబెలె రోడ్డులో నడుచుకుంటూ ఆఫీసుకు వెళ్తుండగా వెంకటేశ్ అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అనితను స్థానికులు తక్షణం బీజీఎస్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్థారించినట్లు పశ్చిమ డీసీపీ సంజీవ్ పాటిల్ తెలిపారు.
వెంకటేశ్ ఇటీవల మార్కెట్కు వెళ్లి రూ. 80 పెట్టి పదునైన కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజరాజేశ్వరి ఆస్పత్రిలో అనిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.