ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలేపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు చేతకాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో ఆయన వివాదంలో పడ్డారు.
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలేపై సెక్సిస్ట్ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఓబీసీ రిజర్వేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై నిరసనకు నేతృత్వం వహిస్తున్న పాటిల్.. ‘మీకు రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి వంట చేసుకోండి’ అని సూలేను ఉద్దేశించి అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమర్తె అయిన ఆమె అదే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే చంద్రకాంత్ పాటిల్ ఇలా వ్యాఖ్యలు చేయడానికి ఒక రోజు ముందు సుప్రియా సూలే ఇదే అంశంపై పార్టీ సమావేశంలో ప్రసంగించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్కు ఓబీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నుంచి ఎలా ఉపశమనం లభించిందని ప్రశ్నిస్తూ.. ‘‘ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ‘ఎవరినో’ కలిశారు.. అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియడం లేదు. మరో రెండు రోజుల్లో ఓబీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది’’ అని అన్నారు.
మహారాష్ట్ర మంత్రి అనిల్ పరాబ్ కి ఈడీ షాక్: పలు చోట్ల ఈడీ సోదాలు
సుప్రియా సూలే చేసిన ఈ ప్రసంగం.. అక్కడికి కొద్ది దూరంలో నిరసన తెలుపుతున్న చంద్రకాంత్ పాటిల్ కు చేరాయి. ఈ ప్రసంగంపై ఆయన స్పందించారు. ‘‘నువ్వు రాజకీయాల్లో ఎందుకున్నావ్.. ఇంటికెళ్లి వంట చేసుకో.. రాజకీయాల్లో ఉండి నీకు సీఎంను ఎలా కలవాలో అర్థం కావడం లేదు. నువ్వు కూడా ఢిల్లీకి వెళ్లు లేదా నరకానికి వెళ్లు. కానీ రిజర్వేషన్ ఇవ్వు ’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
20లక్షలు దోచుకుని.. ‘ఐలవ్ యూ’ అని రాసిపెట్టి.. ఓ దొంగ వింత చేష్ట..
ఇదిలా ఉంటే రాజకీయాలకు దూరంగా ఉండే సుప్రియా సూలే భర్త సదానంద్ సూలే.. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలకు సోషల్ మీడియా స్పందించారు. పాటిల్ మాటలను ఖండించారు. ‘‘ నా భార్యను చూసి గర్వపడుతున్నాను. నేనెప్పుడూ దానిని కొనసాగిస్తూనే ఉన్నాను. వారు (బీజేపీ) స్త్రీ ద్వేషి. వీలైనప్పుడల్లా స్త్రీలను వారు కించపరుస్తారనే ఉంటారు. భారతదేశంలోని అనేక మంది కష్టపడి పనిచేసే, ప్రతిభావంతులైన మహిళలలో నా భార్య కూడా ఒకరు. ఆమె ఒక గృహిణి, తల్లి. అలానే సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ కూడా. నా భార్య పట్ల నేను గర్వంగా ఉన్నాను. చంద్రకాంత్ పాటిల్ మాటలు మహిళలందరికీ అవమానకరమే.’’ అని అన్నారు.
కాగా.. స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లపై స్టే విధించడంతో గత కొన్ని నెలలుగా మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం న్యాయస్థానాల్లో జరిగిన పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిందని బీజేపీ ఆరోపిస్తుండగా, కేంద్రమే సరైన డేటాను అందించడం లేదని అధికారిక మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నిందించింది.
