ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ అధ్యక్షతన మహాకుంభ్ నగర్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కొత్త అభివృద్ధి ప్రాంతాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వంతెనల నిర్మాణం వంటివి ఇందులో ఉన్నాయి.

మహాకుంభ్ నగర్ : రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం మహాకుంభ్‌లోని త్రివేణి సంగమం వద్ద నిర్వహించిన క్యాబినెట్ సమావేశం నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక ప్రాజెక్టులకు ఈ భేటీలో ఆమోదం తెలిపింది. ఈ చారిత్రాత్మక సమావేశంలో తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను ఆమోదించారు.

స్టేట్ క్యాపిటల్ రీజియన్ తరహాలో రెండు కొత్త రీజియన్‌లతో పాటు రెండు కొత్త లింక్ ఎక్స్‌ప్రెస్‌వేలు, గంగా, యమునా నదులపై రెండు పెద్ద వంతెనల నిర్మాణానికి ఆమోదం లభించింది. ఈ కీలక నిర్ణయాలను బుధవారం మహాకుంభ్ నగర్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌తో పాటు మంత్రివర్గ సభ్యులందరూ హాజరయ్యారు.

144 ఏళ్ల తర్వాత ప్రయాగరాజ్‌లో మహాకుంభ్ సందర్భంగా ఇక్కడ క్యాబినెట్ సమావేశం నిర్వహించామని, పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. చిత్రకూట్, ప్రయాగరాజ్, మీర్జాపూర్, భదోహి, వారణాసి, చందౌలి, సోన్‌భద్ర జిల్లాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు పలు ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని వివరించారు.

ప్రయాగరాజ్-చిత్రకూట్ అభివృద్ధి ప్రాంతానికి ఆమోదం

ప్రయాగరాజ్-చిత్రకూట్ అభివృద్ధి ప్రాంతాన్ని స్టేట్ క్యాపిటల్ రీజియన్ (ఎస్‌సిఆర్) తరహాలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాంతం మతపరంగా, సాంస్కృతికంగా, పర్యాటకపరంగా కీలకమైనదని, దీనివల్ల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.

ఇక వారణాసి-వింధ్య ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రతిపాదనకు ఆమోదం లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాంతాన్ని మతపరమైన పర్యాటకం, సాంస్కృతిక వారసత్వం, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు.

గంగా ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణ

గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రయాగరాజ్ నుంచి మీర్జాపూర్, భదోహి, వారణాసి, చందౌలి, ఘజియాబాద్ వరకు విస్తరిస్తామని తెలిపారు. ఈ కొత్త లింక్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేతో కూడా అనుసంధానమవుతుందని, దీనివల్ల ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతమవుతుందని చెప్పారు. వారణాసి, చందౌలి, సోన్‌భద్రలను అనుసంధానిస్తూ కొత్త లింక్ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తామని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులను 'ప్రయాగరాజ్-వింధ్య-కాశీ ఎక్స్‌ప్రెస్‌వే'గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

కొత్త వంతెనల నిర్మాణం

యమునా నదిపై సిగ్నేచర్ వంతెనకు సమాంతరంగా కొత్తగా ఆరులేన్ల వంతెన నిర్మించే ప్రతిపాదనకు ఆమోదం లభించిందని సిఎం యోగి తెలిపారు. సలోరి-హేతాపట్టి-ఝూన్సీ మధ్య నాలుగులేన్ల వంతెన నిర్మాణానికి కూడా ఆమోదం లభించిందని, ఇది ప్రయాగరాజ్‌ను మీర్జాపూర్, జౌన్‌పూర్, వారణాసి, ఆజంఘర్, గోరఖ్‌పూర్‌లతో అనుసంధానిస్తుందని చెప్పారు. బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించే ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించిందని, రీవా జాతీయ రహదారితో అనుసంధానానికి కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం లభించిందని తెలిపారు.

క్యాబినెట్ ఆమోదించిన ఇతర కీలక ప్రతిపాదనలు

  • ఉత్తరప్రదేశ్ ఏరోస్పేస్, రక్షణ విభాగం, ఉపాధి ప్రోత్సాహక విధానం 2024కి ఆమోదం
  • భారతీయ పౌర భద్రతా సంహిత 2023లోని సెక్షన్ 20 ప్రకారం ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదం
  • ప్రయాగరాజ్, వారణాసి, ఆగ్రా నగరపాలక సంస్థలకు మున్సిపల్ బాండ్ల జారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి నుంచి క్రెడిట్ రేటింగ్ పెంపుదలకు నిధులు కేటాయించడానికి ఆమోదం
  • టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకారంతో రాష్ట్రంలోని 62 ప్రభుత్వ ఐటిఐలను ఆధునీకరించడం, 5 సెంటర్స్ ఫర్ ఇన్నోవేషన్, ఇన్వెన్షన్, ఇంక్యుబేషన్, ట్రైనింగ్‌ల ఏర్పాటుకు ఆమోదం
  • రాష్ట్రంలోని హథ్రస్, బాగ్‌పత్, కాస్‌గంజ్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద పిపిపి విధానంలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేసేందుకు అర్హత సాధించిన బిడ్డర్ల ఎంపికకు ఆమోదం
  • బలరాంపూర్‌లోని 166 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విద్య విభాగానికి ఉచితంగా బదిలీ చేసి స్వయంప్రతిపత్తి కలిగిన బలరాంపూర్ ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం, బలరాంపూర్‌లో ఏర్పాటు చేస్తున్న కెజిఎంయు శాటిలైట్ సెంటర్‌ను స్వయంప్రతిపత్తి కలిగిన బలరాంపూర్ ప్రభుత్వ వైద్య కళాశాలగా మార్చడానికి ఆమోదం
  • స్వామి వివేకానంద యువ సాధికారత పథకం కింద ఉచిత స్మార్ట్‌ఫోన్ల పంపిణీకి సంబంధించి చివరి బిడ్డింగ్ డాక్యుమెంట్‌కు ఆమోదం
  • ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి ప్రోత్సాహక విధానం 2022 కింద రాష్ట్రంలో మెగా కేటగిరీ పరిశ్రమలకు ప్రత్యేక సదుపాయాలు, రాయితీలు కల్పించేందుకు ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులకు ఆమోదం
  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ), ఫార్చ్యూన్ 500 కంపెనీల పెట్టుబడులకు ప్రోత్సాహక విధానం 2023 కింద అనుమతించిన ఫ్రంట్ ఎండ్ ల్యాండ్ సబ్సిడీ కింద అశోక్ లేలాండ్ లిమిటెడ్‌కు కేటాయించిన భూమికి యుపిసిడాకు చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తాన్ని చెల్లించేందుకు అధికార కమిటీ సిఫారసులకు ఆమోదం