బీజేపీ ఎమ్మెల్యేలకు యడియూరప్ప డిన్నర్ వాయిదా.. కర్ణాటకలో ఏం జరుగుతోంది
అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన విందు వాయిదా పడింది. దీనికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమంటూ వస్తున్న ఊహాగానాల మధ్య సీఎం యడియూరప్ప ఏర్పాటు చేసిన విందు సమావేశం వాయిదా పడింది. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 25న రాత్రి 7గంటలకు నగరంలోని ఓ హోటల్లో బీజేపీ ఎమ్మెల్యేలకు డిన్నర్ ఏర్పాటు చేశారు యడియూరప్ప. అయితే దానిని వాయిదా వేసినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, వాయిదాకు స్పష్టమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. అయితే మళ్లీ ఈ విందు భేటీకి కొత్త తేదీని కూడా ఖరారు చేయలేదని సమాచారం.
Also Read:మోడీ వద్దకు ఆరు బ్యాగులు తీసుకెళ్లారు .. వాటిలో ఏమున్నాయ్: యడియూరప్పపై కుమారస్వామి వ్యాఖ్యలు
అలాగే, సీఎంగా యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి ఈ నెల 26 నాటికి రెండేళ్లు పూర్తికానుండటంతో అదే రోజు బీజేపీ శాసనసభాపక్ష సమావేశం కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అదే రోజు నాయకత్వ మార్పులపై వస్తోన్న ఊహాగానాలపైనా ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినా.. అలాంటిదేమీ లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల యడియూరప్ప తన తనయుడితో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు. దీంతో నాయకత్వ మార్పు జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో యడియూరప్ప డిన్నర్ వాయిదా పడటం కర్ణాటకలో పెద్ద చర్చకు కారణమైంది.