ఓ యువతి తన ప్రియుడికి రూ.10 నోటుపై రాసిన ప్రేమ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అందులో ఆమె ఏం రాసిందో ఒకసారి చూస్తే: 

నచ్చిన అమ్మాయికి లేదా అబ్బాయికి తన మనసులోని మాటను చెప్పేందుకు యువతీ యువకులు ఉపయోగించే సాధనం ప్రేమ లేఖ (love letter) . నేటి కంప్యూటర్ యుగంలోనూ ప్రేమ లేఖలకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. కాగా... సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ప్రేమ సందేశానికి సంబంధించిన పిక్ నెట్టింట్‌లో వైరల్ అవుతోంది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అదే ఇక్కడ విశేషం. ఆ ప్రేమ సందేశాన్ని రాసింది కాగితంపై కాదు.. 10 రూపాయల నోటు మీద. 

కుసుమ్ (Kusum ) అని అమ్మాయి.. తన ప్రియుడు విశాల్‌కు (vishal) ఈ ప్రేమ సందేశాన్ని పంపినట్లు నోటు మీద వున్న రాతలను బట్టి తెలుస్తోంది. అయితే ఆ ప్రేమ లేఖను పది రూపాయల నోట్‌పై ఎప్పుడు, ఎందుకు రాసింది అనేది మాత్రం తెలియరాలేదు. ఈ ప్రేమ సందేశం ప్రకారం.. ఏప్రిల్ 26న కుసుమ్ వివాహం జరగనుందట. ఈ లోపు తాను ప్రేమించిన విశాల్‌కు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ పెళ్లి జరిగేలోగా తనను కాపాడాల్సిందిగా ఆమె అందులో ప్రస్తావించింది.

ప్రస్తుతం ఈ ప్రేమ సందేశానికి సంబంధించిన పిక్‌ను నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది ఈ పోస్ట్ ను షేర్ చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం దీనిపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. "ఈ లెటర్ ఆమె ప్రియుడు విశాల్ కు చేరే లోపు ఇద్దరు పిల్లల తండ్రి అవుతాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. అన్నట్లు ఆన్‌లైన్‌లో ఈ ప్రేమ లేఖకు 400కు పైగా లైకులు వచ్చాయి.