Asianet News TeluguAsianet News Telugu

కలలో శివుడు కనిపించాడట... సజీవ సమాధికి యత్నం..!

దేవుడు కలలలోకి వచ్చాడంటూ.. ఓ మహిళ తనను తాను సజీవ సమాధి చేసుకోవాలని అనుకుంది. ఆమెకు గ్రామస్థులు సహాయం చేయడం గమనార్హం.

woman try to buried alive in UP
Author
Hyderabad, First Published Feb 12, 2021, 8:49 AM IST

ఓ వైపు దేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే మరో వైపు జనాలు ఇంకా మూఢనమ్మకాల ముసుగులో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా మదనపల్లిలో మూఢనమ్మకాలకు ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు బలిచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా.. ఉత్తరప్రదేశ్ లో అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. దేవుడు కలలలోకి వచ్చాడంటూ.. ఓ మహిళ తనను తాను సజీవ సమాధి చేసుకోవాలని అనుకుంది. ఆమెకు గ్రామస్థులు సహాయం చేయడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

కాన్పూర్‌ నగర్‌ జిల్లాలోని ఘటంపూర్‌ ప్రాంతంలో ఉన్న సజేటి గ్రామానికి రామ్‌ సంజీవన్‌, గోమతిదేవి భార్యాభర్తలు. వీరు శివభక్తులు. ఆమె భక్తిభావనలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశంతో తాను జీవ సమాధి కావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇంటి బయట గొయ్యి తవ్వి అందులో తనను సమాధి చేయాలని కుటుంబసభ్యులను కోరింది.

 శివుడు తనకు కలలో కనిపించాడని, మహాశివరాత్రికి ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు తాను సమాధి కావాలని పట్టుబట్టింది. దీంతో ఆమెను సమాధి చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇంటి బయట నాలుగు అడుగుల గొయ్యిని తవ్వించారు. ఆ తర్వాత మంచంపై ధ్యానముద్రలో కూర్చుని ఉన్న గోమతిదేవిని గొయ్యిలో దించారు. దీనికి స్థానికులంతా సహకరించారు. అనంతరం అందరూ భజనలు చేస్తూ పూలు, మట్టిని ఆమెపై చల్లారు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆమెను సమాధి చేయడం చూసి ఖంగు తిన్నారు. వెంటనే గోమతిదేవిని గొయ్యి లోపలి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు రావడం ఆలస్యమై ఉంటే ఆమె జీవ సమాధి అయ్యి ఉండేది. మూఢ నమ్మకాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios