ఉన్మాది దాడిలో గాయపడిన లెక్చరర్ అంకిత మృతి: వార్ధాలో ఉద్రిక్తత
ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన లెక్చరర్ అంకిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ముంబై: ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ లెక్చరర్ అంకిత సోమవారం నాడు మృతి చెందింది. దీంతో వార్ధాలో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడు బికేష్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ అంకిత మృతదేహాం తరలిస్తున్న అంబులెన్స్పై స్థానికులు రాళ్లతో దాడికి దిగారు.
లెక్చరర్ అంకిత వార్ధాలోని హింగన్ ఘాట్లో నివాసం ఉంటుంది. ఈ నెల 3వ తేదీన అంకితను ఆమె పనిచేసే కాలేజీ గేటు ముందే వికేష్ అనే ఉన్మాది కిరోసిన్ పోసి దగ్దం చేశాడు. ఆమె 40 శాతానికి పైగా కాలిపోయింది. 40 శాతం గాయాలతో లెక్చరర్ అంకిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు మృతి చెందింది.
అంకితకు ముఖం, ఎడమ చేయి, మెడ కళ్లు తదితర అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా వైద్యులు ప్రకటించారు. అయితే ఆమెకు వారం రోజులుగా వైద్యులు చికిత్స చేశారు. ఇవాళ ఉదయం అంకిత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
మృతురాలిని వికేష్ కొంత కాలంగా వేధింపులకు గురి చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. వికేష్కు పెళ్లై భార్య ఉన్నప్పటికీ కూడ తనను పెళ్లి చేసుకోవాలని అంకితను వేధింపులకు గురి చేశాడు. వికేష్ తో పెళ్లికి అంకిత ఒప్పుకోలేదు. దీంతో అంకితపై ఈ నెల 3వ తేదీన ఆమె పనిచేసే కాలేజీ గేటు ముందే కిరోసిన్ పోసి నిప్పటించాడు వికేష్.
అంకిత మృతదేహాన్ని ఆసుపత్రి నుండి ఇంటికి తరలిస్తున్న సమయంలో అంబులెన్స్ అద్దాలను స్థానికులు ధ్వంసం చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను శాంతింపజేసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.
మరో వైపు అంతికత కుటుంబానికి న్యాయం చేస్తామని సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని కూడ ఆయన హామీ ఇచ్చాడు.