ఆమెకు ఇద్దరు ప్రియులు: భర్తను చంపేసి కరోనా డ్రామా ఆడిన భార్య
ఇద్దరు ప్రియులతో కలిసి ఓ మహిళ తన భర్తను చంపేసి, కరోనాతో మరణించినట్లు నాటకమాడింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. అయితే, భర్త సమీప బంధువు కారణంగా అసలు విషయం వెలుగు చూసింది.
చెన్నై: తమిళనాడులో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను చంపేసి, కరోనాతో మరణించినట్లు నాటకమాడింది. అయితే, ఆమె గుట్టు రట్టయింది. భర్తను చంపి, కరోనా కారణంగా శ్వాస ఆడక మరణించాడని నాటకమాడింది.
మృతుడి సమీప బంధువు ఆస్పత్రికి రావడంతో ఆమె నాటకం బయటపడింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోబి చెట్టి పాళయం సమీపంలోని కుమార పాళయంకు చెందిన శ్రీనివాసన్ స్థానికంగా సెలూన్ నడుపుతున్నాడు.
ఆయనకు భార్య ప్రభ, పదేళ్ల కూతురు ఉన్నారు. భర్తకు శ్వాస ఆడడం లేదని, కరోనా వచ్చినట్లుందని భార్య ప్రభ ఏడ్పు లంకించుకుంది. ఇరుగు పొరుగువారి సహాయం కోరింది. అయితే కరోనా భయంతో వారెవరూ ముందుకు రాలేదు. చివరకు ఇద్దరు వ్యక్తులు ఆమెకు సహకరించేందుకు ముందుకు వచ్చారు. సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు.
శ్రీనివాసన్ ను వైద్యులు పరీక్షించారు. అయితే, అతను అప్పటికే చనిపోయాడని వారు తేల్చారు. దాంతో తనతో వచ్చిన ఇద్దరు వ్యక్తులతో మృతదేహాన్ని ఇంటికి తరలించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఆస్పత్రి వద్దకు శ్రీనివాసన్ సమీప బంధువులు ఒకరు వచ్చారు. దాంతో ప్రభలో ఆందోళన ప్రారంభమైంది.
శ్రీనివాసన్ మృతదేహాన్ని అతను క్షుణ్నంగా పరిశీలించాడు. దాంతో అతనికి మెడ భాగంలో గాయం కనిపించింది. ఆ విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో ఆమెతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. పోలీసుల విచారణలో ప్రభ తన నేరాన్ని అంగీకరించింది.
తన ప్రియులు సెలూన్ శరవణకుమార్, పొరోటా వెల్లింగిరిలతో కలిసి తన భర్తను చంపినట్లు ఆమె చెప్పింది. తాను ఫోన్ లో మాట్లాడుతుండడం గమనించి శ్రీనివాసన్ మందలించాడని, దాంతో అతన్ని చంపేశానని ఆమె చెప్పింది.