ఓ మహిళ కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేసింది. కొడుకు సహాయం తీసుకొని మరీ చంపించడం గమనార్హం.


సమాజంలో రోజు రోజుకీ నేరాలు పెరిగిపోతున్నాయి. బంధాలు.. బంధుత్వాల మీద కనీసం ప్రేమ కూడా ఉండటం లేదు. కొన్ని ఘటనలు చూస్తుంటే.. కనీసం మానవత్వం కూడా కనుమరుగైపోతుందా అనే అనుమానం కలుగుతోంది. తాజాగా.. ఓ మహిళ కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేసింది. కొడుకు సహాయం తీసుకొని మరీ చంపించడం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంజూరుకు చెందిన సుబ్బరాయప్ప అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. వైట్‌ఫీల్డ్‌ సమీపంలో మృతదేహం బయటపడింది. భార్య యశోదమ్మ, కుమారుడు దేవరాజు అందరికీ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పారు.


ట్రాఫిక్‌ పోలీసులు విచారించగా ఆ సమయంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగలేదని తేలింది. దీంతో మృతుని కాల్‌లిస్టును తనిఖీ చేయగా అనిల్‌ అనే వ్యక్తి చివరగా కాల్‌ చేశాడని, అతడే స్కార్పియోలో తీసుకెళ్లాడని సీసీ కెమెరాల చిత్రాల్లో గుర్తించారు. అనిల్‌ను పట్టుకుని ప్రశ్నించగా నగేష్, ధనుష్, సునీల్‌కుమార్‌ అనే వారితో కలిపి హత్య చేశామని చెప్పారు. అతని భార్య, కొడుకు రూ.6 లక్షలు సుపారి ఇచ్చారని తెలిపారు. ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలిసింది.