ప్రేమించి పెళ్లి చేసుకొని జంప్: భర్తను కాలర్ పట్టుకొని స్టేషన్తీసుకెళ్లిన భార్య
ప్రేమించి పెళ్లి చేసుకొన్న యువతి తనను మోసం చేసి వెళ్లిపోయిన భర్తను వెతికి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది.తనతో రావాలని యువతి ప్రాధేయపడింది కానీ మరో యువతిని వివాహం చేసుకొన్నానని అతను చెప్పడంతో కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది.
భువనేశ్వర్: ప్రేమించానని నమ్మించాడు, ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. కొంత కాలం కాపురం చేసిన తర్వాత ఆ యువతికి చెప్పా పెట్టకుండా ఉడాయించాడు. తన భర్త ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని చొక్కా పట్టుకొని పోలీస్ స్టేషన్ ను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది.ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని బిసంకటక్ సమితిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బిసంకటక్ ఐఐసీ అధికారి సుభాష్చంద్ర కొరకొరా ఈ ఘటనకు సంబంధించి వివరాలు మీడియాకు వెల్లడించారు.
ఒడిశా రాష్ట్రంలోని కుంకుబడి గ్రామానికి చెందిన యువకుడు సుమన్ కుసులియా ఉపాధి కోసం 6 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రొయ్యిల పరిశ్రమలో పనికి చేరాడు. అదే పరిశ్రమలో పనిచేస్తున్న విశాఖపట్నం జిల్లా పాడేరుకు చెందిన యువతి బెలసుర కుమారితో స్నేహం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో 3నెలల క్రితం అక్కడికి సమీపంలోని ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అక్కడే కాపురం కూడా పెట్టారు.
కొద్ది రోజుల క్రితం సుమన్ ఎవరికీ చెప్పకుండా భీమవరం నుంచి బిసంకటక్ వచ్చేశాడు. రోజులు గడుస్తున్నా తన భర్త తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన కుమారి అతని ఆచూకీ కోసం ఆరా తీసింది. స్వగ్రామంలో ఆటో నడుపుతున్నాడని తెలుసుకొంది. తన అన్నయ్య సాయంతో శుక్రవారం రాత్రి కుమారి బిసంకటక్ చేరుకుంది.
శనివారం ఉదయాన్నే భర్త సుమన్ కుసులియా కోసం ఆటోస్టాండ్లో వెతకింది. అక్కడ ఎదురైన సుమన్ను కుమారి నిలదీసింది. తనతో రమ్మని ప్రాధేయపడింది. అతడు అంగీకరించలేదు. తనకు కొద్ది రోజు క్రితమే వేరే అమ్మాయితో వివాహం జరిగిందని చెప్పడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. అందరూ చూస్తుండగానే అతడి షర్ట్ కాలర్ పట్టుకొని బిసంకటక్ పోలీస్ స్టేషన్కు ఈడ్చుకుంటూ వెళ్లింది. దీనిపై పోలీసులు ఇంతవరకు కేసు నమోదు చేయనప్పటికీ సుమన్ను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు.