రేపటి భారత్ బంద్కు మద్ధతిస్తున్న పార్టీలు ఇవే
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో పాటు ఆ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలంటూ ప్రతిపక్షాలు రేపు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరగనుంది.
అడ్డూ, అదుపు లేకుండా వరుస పెట్టి పెరిగిపోతున్న పెట్రో ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ.. మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై నిరసనగా ప్రతిపక్షాలు సోమవారం ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చాయి. ఈ బంద్కు పలు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు మద్ధతు ప్రకటించగా... మిగిలిన రాష్ట్రాల్లోని పార్టీలు బంద్కు దూరంగా ఉండాలని నిర్ణయించాయి.
సోమవారం ఉదయం 9 గంటలకు బంద్ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. దీని వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా తెలిపారు.
ఈ బంద్కు జేడీఎస్, డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, నేషనల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు బంద్కు సంపూర్ణ మద్థతు ప్రకటించాయి. బంద్ కారణంగా ముందు జాగ్రత్తగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాయి.
మరోవైపు ఈ బంద్కు తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. సోమవారం ఎలాంటి సెలవు మంజూరు చేసేది లేదంటూ ప్రభుత్వోద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. కేరళ వరద బీభత్సం దృష్ట్యా ముస్లిం లీగ్ భారత్ బంద్కు దూరంగా ఉండాలని నిర్ణయించింది.