మాధురీ దీక్షిత్ ని చూపించి.. వాజ్ పేయీని మాయచేశారు..!
అది కూడా అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్ ని చూపించి మాయ చేసి తినకుండా చేశారు.
భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్ పేయీ మంచి భోజన ప్రియుడు. ఆయనకు ఆహారం అంటే చాలా మక్కువ ఎక్కువ. అలాంటి ఆయన్ని.. తనకు ఇష్టమైన గులాబ్ జాంలను తినకుండా చేశారు. అది కూడా అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్ ని చూపించి మాయ చేసి తినకుండా చేశారు.
వాజ్ పేయీ కి భోజనం అంటే ఎంత ఇష్టమంటే..కోల్కతాలో పచ్కాలు, హైదరాబాద్ వస్తే బిర్యానీ, హలీం; లఖనవూ వెళ్తే గలోటీ కబాబ్లను తప్పకుండా తినేవారు. చాట్ మసాలా చల్లిన వేడి పకోడీ తినడమన్నా ఇష్టమే. మసాలా టీ అంటే ఇష్టపడేవారు. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు ఎదురుగా వేరుసెనగ పలుకులు ఉండాల్సిందే. పాత దిల్లీలో దొరికే బెండకాయలు-బంగాళదుంపల కూర, చాట్ తీసుకురావాలని కేంద్రమంత్రి విజయ్ గోయల్కు చెప్పేవారు. వెంకయ్య నాయుడైతే రొయ్యలు తీసుకెళ్లేవారు.
ఆయనకు గులాబ్జాంలంటే చాలా ఇష్టం. ఒకసారి ప్రధానిగా ఉన్నప్పుడు ఇచ్చిన అధికార విందులో గులాబ్జాంలను కూడా పెట్టారు. ఆరోగ్యం దృష్ట్యా ఆయన వాటిని తినకూడదు. దాంతో అక్కడి సహాయకులు ఓ ఉపాయం ఆలోచించారు. ఆ విందుకు వచ్చిన సినీ నటి మాధురీ దీక్షిత్ను ఆయనకు పరిచయం చేశారు. ఇద్దరూ సినిమాల గురించి మాట్లాడుతున్న సమయంలో గులాబ్జాంలను అక్కడి నుంచి తీసేసి, వాటిపై ఆయన దృష్టి పడకుండా చేశారు.