జీ 20 సమ్మిట్ సజావుగా జరిగేందుకు దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా చర్యలతో పాటు పబ్లిక్ హాలీడేస్ను ప్రభుత్వం ప్రకటించింది. దేశ రాజధానిలో బ్యాంకులు, ఆర్ధిక, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించారు.
జీ 20 సమ్మిట్ సజావుగా జరిగేందుకు దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా చర్యలతో పాటు పబ్లిక్ హాలీడేస్ను ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. దీంతో సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు దేశ రాజధానిలో బ్యాంకులు, ఆర్ధిక, వాణిజ్య సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆగస్ట్ 23నే ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడంతో పాటు సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు గాను కార్యాలయాలు, పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయించింది. పాఠశాలలు ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహించుకోవచ్చని, కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే అవకాశాన్ని అందించాలని ప్రభుత్వం సూచించింది.
ఢిల్లీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జారీ చేసిన నోటీఫికేషన్ ప్రకారం సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి. అలాగే ఢిల్లీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్, 1954 సెక్షన్ 16 (3) (i) ప్రకారం న్యూఢిల్లీ పోలీస్ జిల్లా అధికార పరిధిలో ఉన్న అన్ని వాణిజ్య , వ్యాపార సంస్థలు సెప్టెంబర్ 8 నుండి 10వ తేదీ వరకు మూసివేయబడతాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 (26 ఆఫ్ 1881) సెక్షన్ 25 పరిధిలోకి వచ్చే న్యూ ఢిల్లీ పోలీస్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న అన్ని వాణిజ్య బ్యాంకులు , ఆర్థిక సంస్థలు సెప్టెంబర్ 8-10 వరకు పబ్లిక్ సెలవులను పాటించాల్సి వుంటుంది.
అయితే మెట్రో సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది. సుప్రీంకోర్టు, ఖాన్ మార్కెట్, మండి హౌస్ , సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లు మాత్రం మూడు రోజుల పాటు మూసివేయబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే.. భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ జీ 20 సమ్మిట్లో'ఒక భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే థీమ్పై దృష్టి పెట్టారు. ఈ థీమ్ మానవ, జంతువు, మొక్కలు, సూక్ష్మజీవుల విలువను తెలుపుతుంది.
భారతదేశం డిసెంబర్ 1, 2023న ఇండోనేషియా నుండి G20 అధ్యక్ష పదవిని స్వీకరించింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. గడిచిన 17 ఏళ్లుగా జీ20 దేశాలు సాధించిన ముఖ్యమైన మైలురాళ్లపై తాజా సమావేశంలో చర్చించనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 2022 నుండి ఆగస్టు 2023 వరకు దాదాపు 200 సమావేశాలు నిర్వహించబడతాయి. కీలకమైన ఢిల్లీ G20 సమ్మిట్ మాత్రం సెప్టెంబర్ 9 నుండి సెప్టెంబర్ 10, 2023 వరకు షెడ్యూల్ చేశారు. ఇందులో సభ్య దేశాలతో పాటు అతిథి దేశాలు పాల్గొంటాయి.
ఇక.. సమావేశాల నేపథ్యంలో .. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 115 ప్రకారం కొన్ని పరిమితులు అమలులో ఉంటాయి. వీటిలో ఆశ్రమ్ చౌక్, భైరాన్ మార్గ్, పురానా ఖిలా రోడ్ , మథుర రోడ్డులో వాహన రాకపోకలు నిషేధించారు. G20 సమ్మిట్కు ముందు పోలీసులు పూర్తి డ్రెస్ రిహార్సల్స్ను నిర్వహించడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేశారు. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు, రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు రిహార్సల్ సమయం ఉంటుందని తెలిపారు. ఆదివారం రిహార్సల్ సమయాలు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, 9:30 నుండి 10:30 వరకు .. మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు వున్నాయి.
కార్కేడ్ రిహార్సల్స్ సమయంలో, సర్దార్ పటేల్ మార్గ్-పంచశీల్ మార్గ్, సర్దార్ పటేల్ మార్గ్-కౌటిల్య మార్గ్, గోల్ మేతి రౌండ్అబౌట్, మాన్సింగ్ రోడ్ రౌండ్అబౌట్, సి-హెక్సాగాన్, మధుర రోడ్, జాకీర్ హుస్సేన్ మార్గ్-సుబ్రమణ్యం భారతీ మార్గ్-, రింగ్ రోడ్, సత్య మార్గ్/శాంతిపథ్ రౌండ్ అబౌట్, జనపథ్-కర్తవ్యాపథ్, బరాఖంబా రోడ్ ట్రాఫిక్ సిగ్నల్, టాల్స్టాయ్ మార్గ్ , వివేకానంద్ మార్గ్లలో రాకపోకలు నిషేధించారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు కోరారు.
ద్విచక్ర వాహనదారులు రింగ్ రోడ్, ఆశ్రమ చౌక్, సరాయ్ కాలే ఖాన్, మహాత్మా గాంధీ మార్గ్, ఐపీ ఫ్లైఓవర్, ఐఎస్బీటీ కాశ్మీరీ గేట్, రింగ్ రోడ్ , మజ్ను కా తిలాలను శనివారం ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అదేవిధంగా, తూర్పు , పశ్చిమ కారిడార్ మధ్య ప్రయాణానికి డీఎన్డీ ఫ్లైఓవర్, రింగ్ రోడ్, ఆశ్రమ చౌక్, మూల్చంద్ అండర్పాస్, ఎయిమ్స్ చౌక్, రింగ్ రోడ్, ధౌలా కువాన్, రింగ్ రోడ్, బ్రార్ స్క్వేర్ , నరైనా ఫ్లైఓవర్లను ఉపయోగించుకోవచ్చు.
ఆదివారం, మహాత్మా గాంధీ మార్గ్, ఐపి ఫ్లైఓవర్, రాజ్ఘాట్ చౌక్, శాంతి వాన్ చౌక్, సలీమ్ ఘర్ బైపాస్, భైరాన్ రోడ్, రింగ్ రోడ్, మధుర రోడ్, షేర్షా రోడ్, సి-హెక్సాగాన్ , మాన్సింగ్ రోడ్, గోల్ వద్ద ఉన్న రౌండ్అబౌట్లలో ట్రాఫిక్ రాకపోకలను నియంత్రించనున్నారు. మేథీ, తీన్ మూర్తి, యశ్వంత్ ప్లేస్, బ్రిగ్ హోషియార్ సింగ్ మార్గ్, టాల్స్టాయ్ మార్గ్లలోనూ ట్రాఫిక్ను మళ్లించనున్నారు.
ప్రయాణికులు తమ ప్రైవేట్ వాహనాలు, ఆటో-రిక్షాలు, ట్యాక్సీలను న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ , పాత ఢిల్లీ రైల్వే స్టేషన్లకు ప్రయాణించడానికి అనుమతించబడతారు. విమానాశ్రయానికి ప్రయాణించడానికి ప్రైవేట్ వాహనాలు, ఆటో-రిక్షాలు , టాక్సీల వినియోగం కూడా నిర్దిష్టంగా అనుమతించబడుతుంది. సిటీ బస్సు సర్వీసుల్లో ఎలాంటి మార్పులు వుండవని ప్రభుత్వ అధికారులు తెలిపారు. మరోవైపు.. ఢిల్లీలో జరగనున్న G20 సమ్మిట్ దృష్ట్యా సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో ప్రభుత్వం అనేక ఆంక్షలను జారీ చేసింది. మద్యం దుకాణాలు సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూసివేయబడతాయని అధికారిక నోటిఫికేషన్ పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా వంటి ప్రపంచ నాయకులతో పాటు వారి ప్రతినిధుల బృందాలు, పెద్ద ఎత్తున మీడియా బృందాలు ఢిల్లీలోని దాదాపు అన్ని టాప్ ఫైవ్ స్టార్ హోటల్స్ను సెప్టెంబర్ 6 నుంచి 12 మధ్య బుక్ చేశాయి. ఈ హోటల్లలో ఇప్పటికీ అందుబాటులో ఉన్న కొన్ని గదులకు టారీఫ్లు కూడా భారీగా పెరిగాయి. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి తొమ్మిది "అతిథి దేశాల" ప్రతినిధులను కూడా శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆహ్వానించింది.
G20 అంటే 19 దేశాలు, ఈయూతో కలిపి రూపొందించబడింది. 19 దేశాలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్.
