పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.  

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఉత్తర బెంగాల్‌ ప్రాంతంలో మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబడిందని టీఎంసీ వర్గాలు తెలిపాయి. మమతా బెనర్జీకి ఎలాంటి ప్రమాదం లేదని.. ఆమె క్షేమంగా ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మమతా బెనర్జీ జల్పాయ్‌గురిలోని క్రింటిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత బాగ్‌డోగ్రా వెళ్తున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సెవోక్ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిందని టీఎంసీ నేత రాజీబ్ బెనర్జీ తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మంగళవారం ఉదయం జల్పాయ్‌గురిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ఆ తర్వాత బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి బయలుదేరారు. అయతే బైకుంతపూర్ అడవుల మీదుగా మమతా బెనర్జీ హెలికాప్టర్ వెళ్లాల్సి ఉండగా.. భారీ వర్షం కురుస్తుండటంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్‌లో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

అనంతరం మమతా బెనర్జీ రోడ్డు మార్గంలో బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ఆమె కోల్‌కత్తా బయలుదేరి వెళ్లనున్నట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి.