చోళుల టెక్నాలజీని గ్రహించలేకపోయాం.. బృహదీశ్వరాలయ గొప్పధనాన్ని చెప్పే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
బృహదీశ్వరాలయ ఆలయ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఓ ఇంటీరియర్ డిజైనర్ రూపొందించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఈ వీడియోలో చోళ సామ్రాజ్య నిర్మాణ శైలిని ఆమె వివరించారు.
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను, ఫన్నీ, ఇంట్రెస్టింగ్ వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేస్తుంటారు. ఆయన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలు ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ఆయన బృహదీశ్వరాలయానికి సంబంధించిన ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో చోళుల గొప్పధనాన్ని ఓ ఇంటీరియర్ డిజైనర్ వివరించారు.
ఇటీవల ఓ ఇంటీరియర్ డిజైనర్ శ్రవణ్య రావ్ పిట్టీ తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో ఆమె తమిళనాడులోని ప్రసిద్ధ బృహదీశ్వరాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన వీడియోలను వెల్లడించారు. గిజా పిరమిడ్ చూడాల్సిన కట్టడం అని, అయితే రాజ రాజ చోళుడు పిరమిడ్ కంటే ఎక్కువ రాళ్లను తరలించి బృహదీశ్వరాలయాన్ని నిర్మించారని కొనియాడారు.
ఈ వీడియోను ఆనంద్ మహీంద్ర తన ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. “ టాలెంటెడ్ డిజైనర్ శ్రవణ్య రావు పిట్టీ అందించిన సమాచారం, స్ఫూర్తిదాయకమైన క్లిప్ ఇది. చోళ సామ్రాజ్యం ఎంత నిష్ణాతులుగా, శక్తివంతంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిందో మనం నిజంగా గ్రహించలేదని అనుకుంటున్నాను. అలాగే మనం దాని చారిత్రక ప్రాముఖ్యతను ఇతర ప్రపంచానికి తగినంతగా తెలియజేయలేదు ” అని ఆనంద్ మహీంద్రా రాశారు.
అయితే చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలతో ఏకీభవించారు. అద్భుతమైన వాస్తుశిల్పానికి వారంతా ఆశ్చర్యపోయారు. “ ఇదొక అద్భుతం! పాపం చాలా మందికి దీని గురించి తెలియదు.’’ అని పేర్కొన్నారు.
‘‘ నిజంగా ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. మన పూర్వీకులు చాలా తెలివైనవారు. అన్ని వనరులు ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనం ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించలేకపోయాము ’’ అని మరో యూజర్ ట్వీట్ చేశారు.
కాగా.. బృహదీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరులో కావేరి నదికి దక్షిణ ఒడ్డున ఉంది. దీనిని 1009 CE లో చోళ రాజవంశ రాజు రాజరాజ I నిర్మించారు. ఇందులో శివుడు పూజలు పూజలు అందుకుంటారు. హిందూ ద్రావిడ శైలిలో ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. దీని నిర్మాణం కోసం భారీ శిలలను ఉపయోగించారు. ఆ కాలంలో ఎలాంటి అధునాతన భారీ క్రేన్ ల సహాయం లేకుండా దీనిని నిర్మించారు. ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.