కరోనా లాక్ డౌన్ మహిమ... విమానంలోనే పెళ్లి.. వీడియో వైరల్
ఇలా అనుకోకుండా వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఓ జంట ఏకంగా విమానంలోనే పెళ్లి చేసేసుకుంది.
కరోనా మహమ్మారి దేశంలో రోజు రోజుకీ విజృంభిస్తోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. రోజు రోజుకీ కేసులు పెరుగుతుండటంతోపాటు.. మరణాలు కూడా అధికమౌతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూ లు విధిస్తున్నారు. ఇలా అనుకోకుండా వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఓ జంట ఏకంగా విమానంలోనే పెళ్లి చేసేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడుకు చెందిన రాకేష్, దక్షిణల పెళ్లి కూడా మంగళవారం జరగాల్సి ఉంది. దీని కోసం ఇరు కుటుంబాల పెద్దలు బెంగళూరు నుంచి మదురైకి వచ్చే విమానంలో బయలు దేరారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడంతో తమిళనాడు సర్కార్ రేపటి(మంగళవారం) నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించింది.
దీంతో పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లను కూడా రద్దు చేసుకున్న ఇరు కుటుంబాలు విమానంలోనే వివాహతంతు కానిచ్చేశాయి. ఇరు కుటుంబాల సమక్షంలో యువ జంట ఒక్కటైంది. కుటుంబ సభ్యులు వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.