Asianet News TeluguAsianet News Telugu

గుట్టుగా 770 కిమీ ప్రయాణం: వికాస్ దూబేది అరెస్టా, లొంగుబాటా?

మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను పోలీసులు అరెస్టు చేశారా, పథకం ప్రకారం అతను లొంగిపోయాడా అనే ప్రశ్న ఉదయిస్తోంది.అతను 770 కిలోమీటర్లు వివిధ రాష్ట్రాల పోలీసుల కళ్లు గప్పి ఉజ్జయిని ఎలా చేరుకున్నాడనే సందేహం వ్యక్తమవుతోంది. 

Vikas Dubey episode: surrener or arrest?
Author
Ujjain, First Published Jul 9, 2020, 12:37 PM IST

కాన్పూర్: మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ పథకం ప్రకారం లొంగిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికాస్ దూబేపై దాదాపు 60 కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ పోలీసులు వికాస్ దూబేది అరెస్టుగా చూపుతున్నారు. ఎనిమిది మంది పోలీసులను చంపిన తర్వాత వికాస్ దూబే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తన గ్రామం నుంచి ఈ నెల 3వ తేదీన పారిపోయాడు. చివరకు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చేరుకున్నాడు. 

వికాస్ దూబే ఈ నెల 7వ తేదీన ఫరిదాబాదులో కనిపించాడు. అయితే, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఉజ్జయినికి చేరుకున్నాడు. తన గ్రామం నుంచి పారిపోయిన వికాస్ దూబే ఢిల్లీ లేదా నోయిడాకు సమీపంలోని నగరాలకు చేరుకుని ఉంటాడని అనుమానించారు. నోయిడా, గురుగ్రామ్, ఫరిదాబాదుల్లో ఎక్కడైనా ఉండవచ్చునని భావించారు. 

అనూహ్యంగా అతను గురువారంనాడు ఉజ్జయినిలో దర్శనమిచ్చాడు. సెక్యూరిటీ గార్డుకు తానెవరో చెప్పుకుని పోలీసులను పిలిచినట్లు తెలుస్తోంది. ఫరిదాబాద్ నుంచి ఉజ్జయిని 770 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి అంత దూరం అతను ఎలా ప్రయాణించాడనే ప్రశ్న ఉదయిస్తోంది. 

తనను అరెస్టు చేసిన వెంటనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే పెద్దగా అరిచాడు. మై వికాస్ దూబ్ హూ, కాన్పూర్ వాలా (నేను వికాస్ దూబేను, కాన్పూర్ కు చెందినవాడిని) అని తనను అరెస్టు చేసిన వెంటనే పెద్దగా అరిచాడు. దాంతో పోలీసు అధికారి అతని తల వెనక బాది అరవకు అని హెచ్చరించాడు. 

అయితే, మహంకాళి ఆలయం వద్ద పథకం ప్రకారం అతను పోలీసులకు లొంగిపోవడానికి ఏర్పాటు చేసుకున్నట్లున్నాడని యూపి డీజీపీ అరవింద్ కుమార్ అన్నారు. తనను తాను మహంకాళి సెక్యూరిటీ గార్డుకు పరిచయం చేసుకున్నాడని, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడని ఆయన చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ పోలీసులు తనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని గ్రహించడంతో, తన అనుచరులు ముగ్గురు పోలీసులు కాల్పుల్లో హతం కావడంతో భయపడి వికాస్ దూబే మధ్యప్రదేశ్ లో పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులతో, రాజకీయ నేతలతో వికాస్ దూబేకు పరిచయాలున్నాయి. 

వికాస్ దూబే అరెస్టును మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ధ్రువీకరించారు. కాన్పూర్ ఎన్ కౌంటర్ తర్వాత తమ పోలీసులు అప్రమత్తయ్యారని, వికాస్ దూబేను పట్టుకోవడానికి అది సాయపడిందని ఆయన అన్నారు. ఇద్దరు వికాస్ దూబే అనుచరులను కూడా అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లోని తన నివాసం వద్ద ఎనిమిది మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే వారం రోజుల తర్వాత పోలీసుల చేతికి చిక్కాడు. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో అతను పోలీసులకు చిక్కాడు. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వికాస్ దూబే పూజలు చేయడానికి వచ్చాడు. మహంకాళి ఆలయం వద్ద సెక్యూరిటీ గార్డు వికాస్ దూబేను పట్టుకున్నాడు. ఆ విషయాన్ని సెక్యూరిటీ గార్డు ఉజ్జయిని ఎస్పీ మనోజ్ సింగ్ కు చెప్పాడు. దాంతో ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను తమ కస్టడీలోకి తీసుకున్నారు. 

వికాస్ దూబేను అదుపులోకి తీసుకున్న విషయాన్ని మధ్యప్రదేశ్ డీజీపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు చెప్పారు. శివరాజ్ సింగ్ చౌహన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు తెలుస్తోంది. 

వికాస్ దూబేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వికాస్ దూబే ముఖ్య అనుచరులు ముగ్గురు హతమయ్యారు. గురువారం ఉదయం ఇద్దరు హతం కాగా, అంతకు ముందు ఒకతను మరణించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios