బెంబేలెత్తించిన బెంగళూరు ట్రాఫిక్.. కారు దిగి మెట్రో ఎక్కిన పెళ్లి కూతురు.. వీడియో వైరల్..
బెంగళూరులో ట్రాఫిక్ భయంకరం అన్న విషయం అక్కడికి వెళ్లొచ్చిన వారికెవరికైనా తెలిసిందే. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అయ్యింది. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఓ పెళ్లికూతురు సమయానికి పెళ్లి మండపానికి చేరుకోవడానికి మెట్రోను ఆశ్రయించింది.
కర్ణాటక : బెంగుళూరులో ఓ విచిత్ర ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఓవధువు కల్యాణ మండపానికి బయలుదేరింది. కానీ బెంగుళూరు ట్రాఫిక్ ఆమెకు చుక్కలు చూపించింది. ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ముహూర్తం సమయానికి మండపానికి చేరుకునే ఆశ కనిపించలేదు. దీంతో ఆమె స్మార్ట్ గా ఆలోచించింది. ముహూర్తం సమయానికి వివాహ వేదికకు చేరుకోవాలంటే మెట్రోనే సరైన మార్గం అనుకుంది. అంతే, వెంటనే కారు దిగి మెట్రో రైలు ఎక్కింది. ఇది చూసి మిగతా ప్రయాణికులు కాస్త ఆశ్చర్యపోయారు.
ఒక ఔత్సాహికుడైతే ఆ పెళ్లి కుమార్తె ముస్తాబులో ఉన్న యువతిని వీడియో కూడా తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో కర్ణాటకలో వైరల్ గా మారింది. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 8,000 మంది వీక్షించారు. ఈ వీడియోకి ‘వాట్ ఏ బ్రైడ్’ అంటూ క్యాప్షన్ కూడా జత చేశాడు. బెంగళూరులో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఈ ఘటన తెలియజేస్తుందని నెటిజెన్లు స్పందించారు.
ఈ వీడియోను ఫరెవర్ బెంగళూరు అనే అకౌంట్ కూడా పోస్ట్ చేసింది. దీంతో ఆ పెళ్లి కూతురు మెట్రోలో ప్రయాణించడం దగ్గరినుంచి.. దిగి పెళ్లి మండపానికి వెళ్లడం వరకు ఉంది. మండపంలో పెళ్లి పీటల మీద కూర్చున్న సీన్ కూడా చివర్లో కనిపిస్తుంది.