ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి చెందిన 30 మంది సభ్యుల బృందం సర్వే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)కి చెందిన 30 మంది సభ్యుల బృందం సర్వే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జ్ఞానవాపి మసీదు పురాతన హిందూ దేవాలయం పైన నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడం వారి లక్ష్యంగా ఈ సర్వే సాగనుంది. ఇక, గత శుక్రవారం జిల్లా జడ్జి ఎకె విశ్వేష్ సర్వేకు సంబంధించిన వీడియోలు, ఫొటోలతో పాటు ఆగస్టు 4వ తేదీలోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని ఎఎస్ఐని ఆదేశించారు.
సందేహాస్పద భవనం “మూడు గోపురాల క్రింద” సర్వే కోసం జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) సాంకేతికతను ఉపయోగించాలని, “అవసరమైతే” అక్కడ తవ్వకం నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. హిందు ప్రతినిధులు చెబుతున్న ‘వాజూ ఖానా’ సర్వేలో భాగంగా ఉండకూడదని తెలిపింది. మసీదు కాంప్లెక్స్లోని ఆ ప్రదేశానికి రక్షణ కల్పిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే, జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేయాలని వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులపై మసీదు నిర్వహణ కమిటీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతోంది. ఏఎస్ఐ సర్వేను అనుమతిస్తూ జిల్లా కోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు.. శివలింగంకు సంబంధించిన సర్వేను వాయిదా వేస్తూ సుప్రీం కోర్టు మే నెలలో ఇచ్చిన ఉత్తర్వులను స్పష్టంగా ధిక్కరిస్తున్నట్లు మసీదు కమిటీ వాదిస్తోంది. ఈ పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.
