ఉత్తరాఖండ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తామని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమవారం హరిద్వార్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆప్ కు ఓటు వేయాలని కోరారు.
Uttarakhand Election News 2022 : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంపై దృష్టి సారించారు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో సోమవారం హరిద్వార్ (haridwar)లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. తామ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్ (Uttarakhand)ను హిందువులకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా మారుస్తామని హామీ ఇచ్చారు. దీంతో పర్యాటక రంగం విస్తృతంగా మెరుగుపరుస్తుందని అన్నారు. వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. అన్నారు.
రాష్ట్ర ఎన్నికలను చారిత్రకం అని అభివర్ణించిన అరవింద్ కేజ్రీవాల్.. త్వరలో పెద్ద మార్పు ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తొలిసారిగా నిజాయితీగల ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. దీని ద్వారా అవినీతిని నిర్మూలించవచ్చని కేజ్రీవాల్ చెప్పారు. ఉత్తరాఖండ్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అయోధ్య (ayodya), అజ్మీర్ షరీఫ్ (azmir sharif), కర్తార్పూర్ సాహిబ్ (kartharpur sahib)లకు ఉచిత తీర్థయాత్ర యాత్రలను కల్పిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్లో లక్ష ఉద్యోగాలు సృష్టిస్తానని కేజ్రీవాల్ తన గత పర్యటనలలో హామీ ఇచ్చారు. రాష్ట్రంలో యువతకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 80 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో మూడో సారి అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (aap) మంచి జోష్ లో ఉంది. పార్టీని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుంది. త్వరలోనే పంజాబ్ (punjab), ఉత్తరప్రదేశ్ (utharpradhesh), గోవా (goa), ఉత్తరాఖండ్ (utharakhand), మణిపూర్ (manipur)లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ప్రధానంగా ఆప్ పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ పై ఆప్ దృష్టి పెట్టింది. ఈ రాష్ట్రాల్లో ఆప్ నాయకులు, అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో కూడా రెండు నెలల నుంచి పలు మార్లు పర్యటించారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుండగా మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.
పంజాబ్, గోవాలో గత ఎన్నికల్లో ఆప్ పోటీ చేసినప్పటికీ పెద్దగా తన ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈ సారి అధికారం చేపట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. చాలా రోజుల నుంచి అక్కడి స్థానిక సమస్యలపై దృష్టి పెట్టిన ఆప్.. ఆ సమస్యలనే ఎన్నికల అస్త్రాలుగా మార్చుకుంది. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని హామీలు రూపొందించడంతో పాటు, ఢిల్లీలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఉపయోగపడిన ఉచిత విద్య, విద్యుత్, ఆరోగ్య సేవలను తన మేనిఫెస్టో (menifesto)లో పెట్టింది. అలాగే స్థానిక పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ అక్కడ అధికారంలో ఉన్న పార్టీలపై విమర్శలు గుప్పిస్తోంది. అవినీతి రహితంగా పాలన అందిస్తామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని, గెలిచిన తరువాత పార్టీ మారబోమని తమ ఎమ్మెల్యే అభ్యర్థులతో గోవాలో ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ లీగల్ అఫిడవిట్ పై సంతకాలు పెట్టించారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తూ ఆప్ ముందుకెళ్తోంది. మరి ఆ వ్యూహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలంటే మార్చి 10వ తేదీ వరకు ఆగాల్సి ఉంటుంది.
