యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని ఉత్తరాఖండ్ బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టలేదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతుందనే భయంతో చివర్లో ఈ విషయాన్ని సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారని అన్నారు.
ఉత్తరాఖండ్ (uttarakhand)లో బీజేపీ (bjp) ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి పౌర స్మృతిని ముసాయిదాను రూపొందించడానికి ఒక కమిటీ వేస్తానని పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) చేసిన ప్రకటనపై ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. బీజేపీ పరిస్థితి బాగా లేదని గ్రహించిందని, అందుకే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తానని చెప్పిందని తెలిపారు. బుధవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తాను బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను చదివానని, యూసీసీ అంశానని ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని గ్రహించిన బీజేపీ చివర్లో ఈ అంశాన్ని ప్రకటించిందని అన్నారు.
ఇదే విషయంలో గతంలో ఒక సారి అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. యూనిఫాం అంటే సాధారణ దుస్తులు కాదన్న వాస్తవాన్ని సీఎం అర్థం చేసుకోవాలని చెప్పారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ కూడా ఇది స్వచ్ఛందంగా ఉండాలని, తప్పనిసరి కాదని చెప్పేవారని అన్నారు. తాము భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తాము అని చెప్పారు. ఆర్టికల్ 29 ప్రకారం తమ సంస్కృతిని కాపాడుకునే హక్కు ప్రజలకు ఉందని స్పష్టం చేశారు.
యూనిఫాం సివిల్ కోడ్ (Uniform Civil Code) ఆవశ్యకతను పలు సందర్భాల్లో సుప్రీం కోర్టు ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ దిశలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయాన్ని ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రస్తావించారు. తాను రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే..రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ముసాయిదాను సిద్ధం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాననీ తెలిపారు. ఈ యూనిఫాం సివిల్ కోడ్ వల్ల వివాహాలు, విడాకులు, భూమి-ఆస్తి వారసత్వం వంటివాటి విషయంలో వారి మత విశ్వాసంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సమానంగా పరిగణించేందుకు యూసీసీ దోహదపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించిన చట్టాలు ఒక్కో మతానికి ఒక్కో రకంగా ఉన్నాయి.
యూనిఫాం సివిల్ కోడ్ మహిళా సాధికారతను బలోపేతం చేస్తుందని సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. దీంతో పాటు సామాజిక స్నేహం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన చెప్పారు. రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవడానికి యూసీసీ దోహదపడుతుందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. అందరి కోసం యూనిఫాం సివిల్ కోడ్ వల్ల సామాజిక సామరస్యాన్ని పెంపొందుతుందనీ, లింగ విభేదాలు లేకుండా..మహిళా సాధికారతను బలోపేతం చేస్తుందనీ, రాష్ట్రంలోని అసాధారణ సాంస్కృతిక-ఆధ్యాత్మిక గుర్తింపు, పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుందని ధామి చెప్పారు. రాజ్యాంగ నిర్మాతల కలలు సాకారమవడానికి యూనిఫాం సివిల్ కోడ్ దోహదపడుతోందని, రాజ్యాంగ స్ఫూర్తిని మరింత పటిష్టం చేయడానికి ఇదోక అడుగు అనీ, పౌరులందరికీ యూసీసీని అమలు చేయాలని భారత రాజ్యాంగంలోని అధికరణ 44 చెప్తోందన్నారు.
అయితే సీఎం చేసిన ఈ ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాంటి వాగ్దానాలు ఇవ్వడం వల్ల బీజేపీ ఓడిపోతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. ఇలాంటి హామీల వల్ల పార్టీ బలహీనపడుతోందని స్పష్టమవుతోందన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ యువ మోర్చా ఈ విషయంలో ధామి చొరవను ప్రశంసించాయి.
