ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బీజేపీ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. అయితే యూపీలోని సిరతు నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రధాన పోటీ దారుగా అప్నా దళ్ (కె) తరఫున పల్లవి పటేల్ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కౌంటింగ్ కొనసాగుతోెంది. 

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని సిరతు (Sirathu)అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సిరతు నియోజకవర్గం రాష్ట్రంలోని కౌశంబి (Kaushambi) జిల్లాలో ఉంది. ఈ స్థానంలో బీజేపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (Keshav Prasad Maurya) ను పోటీకి దింపింది. అయితే ఇదే స్థానం నుంచి అప్నా దళ్ (కామెరవాడి) పల్లవి పటేల్ అనే అభ్యర్థి పోటీలో దిపింది. అయితే ఉప ముఖ్య‌మంత్రికి ఆమె తీవ్ర పోటీ ఇచ్చింది. దీంతో ఈ స్థానంపై అందరిలో ఉత్కంఠ నెల‌కొంది. 

ప్ర‌స్తుతం వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం సిరతులో కేశవ్ ప్ర‌సాద్ మౌర్య ముందంజ‌లో ఉన్నారు. ప‌ల్ల‌వి పోటీ చేస్తున్న అప్నా దళ్ (కె) పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఇదే స్థానం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విష్ణు కుమార్‌కు టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ సీమాదేవిని రంగంలోకి దించింది. మున్సబ్ అలీ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) టికెట్‌పై సిరతు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శీట్ల ప్రసాద్ విజయం సాధించారు.

కాగా ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సాయంత్రంలోగా ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇక యూపీ రెండో విడత ఎన్నికల్లో తొమ్మిది జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 50 శాతం కంటే అధిక ముస్లిం ఓట‌ర్లు ఈ ప్రాంతంలో ఉండ‌టంతో అన్ని పార్టీలు ఓట‌ర్ల‌కు గాలంవేసేలా ముందుకు సాగాయి. 61.20 శాతం ఓటింగ్ న‌మోదైంది. మూడో ద‌శ‌లో 16 జిల్లాల్లోని 59 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. 623 మంది బ‌రిలో నిలిచారు. కీల‌క‌మైన 16 జిల్లాల్లో ఐదు జిల్లాలు పశ్చిమ యూపీ, 6 అవధ్ ప్రాంతం, 5 బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ద‌శలోనే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ , కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్‌, శివ‌పాల్ యాద‌వ్ వంటి నేత‌లు పోటి ప‌డ్డారు. అలాగే, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాల‌కు నాల్గో ద‌శ‌లో పోలింగ్ జ‌రిగింది.

ఫిబ్ర‌వ‌రి 27న ఐదో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రిగింది. మొత్తం 692 మంది బ‌రిలోకి దిగ‌గా.. వారిలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య , రాంపూర్ ఖాస్ నుంచి కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత ఆరాధన మిశ్రా , కుంట సీటు నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా , యూపీ కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నవారిలో ప్రముఖులు, కేంద్ర మంత్రి అనుప్రియా ప‌టేల్ త‌ల్లి, అప్నాద‌ళ్ నేత కృష్ణా ప‌టేల్ అప్నాదళ్ కే త‌ర‌పున పోటీలో ఉన్నారు. 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో 6వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జ‌రిగింది. ఇక సోమ‌వారం నాడు (మార్చి 7) ఏడోద‌శ (చివ‌రిద‌శ‌) ఎన్నిక‌ల పోలింగ్ జ‌రిగింది. మొత్తం 9 జిల్లాల్లోని 54 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. 613 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు.