అప్లయ్ చేసి.. పరీక్షకు వెళ్లలేకపోయారా..? అభ్యర్థులకు యూపీఎస్సీ శుభవార్త
మనలో చాలా మంది ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు దరఖాస్తు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కొందరు రాతపరీక్షకు హాజరుకాలేరు. ఇలాంటి వారి వల్ల ప్రశ్నాపత్రాలు, పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్లను నియమించడం ద్వారా కోట్లాది డబ్బు వృథా అవుతోంది
మనలో చాలా మంది ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు దరఖాస్తు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కొందరు రాతపరీక్షకు హాజరుకాలేరు. ఇలాంటి వారి వల్ల ప్రశ్నాపత్రాలు, పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్లను నియమించడం ద్వారా కోట్లాది డబ్బు వృథా అవుతోంది.
ఈ దుబారాపై దృష్టి సారించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా ఓ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. దరఖాస్తు చేసుకున్నప్పటికీ పరీక్ష రాలేని వారు ఎవరైనా ఉంటే అలాంటి వారు తమ దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశం కల్పించనుంది.
వచ్చే ఏడాది జరిగే ఇంజనీరింగ్ సర్వీస్ పరీక్ష నుంచి ఈ విధానాన్ని ప్రారంభించి.. వీలైనంత త్వరగా మిగిలిన అన్ని పరీక్షల్లోనూ అమలు చేస్తామని యూపీఎస్పీ ఛైర్మన్ అరవింద్ సక్సేనా వెల్లడించారు.
యూపీఎస్సీ 92వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ... ప్రతి ఏడాది సివిల్స్ ప్రాథమిక పరీక్షలకు దేశవ్యాప్తంగా పది లక్షల మంది దరఖాస్తు చేసుకుని.. కేవలం ఐదు లక్షల మందే హాజరవుతున్నారు.
కానీ యూపీఎస్సీ గైర్హాజరవుతున్న ఐదు లక్షల మందికి కూడా ప్రశ్నా పత్రాలు ముద్రించడంతో పాటు పరీక్షా కేంద్రాలను, ఇన్విజిలేటర్లను నియమించడం వల్ల డబ్బు వృథా అవుతోందని అందువల్ల ఈ విధానాన్ని రూపొందించామని అరవింద్ స్పష్టం చేశారు.