నీట్ యూజీ అభ్యర్థులకు ఎన్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై నీట్ యూజీ రాసే అభ్యర్థులకు వయోపరిమితి నిబంధన తొలగించింది. ప్రస్తుతం జనరల్ కేటగిరీలో నీట్ యూజీ రాయాలంటే అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు. తాజాగా, ఈ నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

న్యూఢిల్లీ: మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (Medical Entrance Exam) రాసే అభ్యర్థులకు కేంద్రం తీపి కబురు ఇచ్చింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) యూజీ (NEET UG) రాసే అభ్యర్థులకు వయోపరిమితి (Upper Age Limit) నిబంధన ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది. అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(నీట్ యూజీ) రాసే అభ్యర్థులకు వయోపరిమితి నిబంధనను తొలగించినట్టు నేషనల్ మెడికల్ కమిషన్ తెలిపింది. మన దేశంలో వైద్య విద్యపై ఉన్న ఉన్నత రెగ్యులేటరీ బాడీ ఈ నేషనల్ మెడికల్ కమిషనే.

ఇప్పటి వరకు నీట్ యూజీ రాయడానికి గరిష్ట వయోపరిమితి 25 ఏళ్లుగా ఉన్నది. ఇది జనరల్ కేటగిరీ వాళ్లకు. కాగా, రిజర్వ్‌డ్ కేటగిరీలకు ఈ పరిమితి 30 ఏళ్లుగా ఉన్నది. నేషనల్ మెడికల్ కమిషన్ గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన నాలుగో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిషన్ సెక్రెటరీ డాక్టర్ పులకేశ్ కుమార్ తెలిపారు.

నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఉద్దేశిస్తూ డాక్టర్ పులకేశ్ కుమార్ రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. నీట్ యూజీ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఈ వయో పరిమితి గురించిన నిబంధనను తొలగించాలని సూచించారు. కాబట్టి, బులెటిన్ ఇన్ఫర్మేషన్ ఈ నిర్ణయానికి అనుగుణంగా సవరించాలని పేర్కొన్నారు.

మన దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సహా మరికొన్ని ఇతర సంబంధిత కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహించే ఏకైక ఎంట్రెన్స్ టెస్ట్.. ఈ నీట్. ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తుంటారు. 

గతేడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా నీట్ నిర్వహించారు. ఈ ఏడాది నీట్ పరీక్ష తేదీ, సమయాలను ఎన్‌టీఏ ఇంకా ప్రకటించలేదు.

NEET PG exam 2022 వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతనెల నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 8 వారాల పాటు పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ ఎగ్జామ్ మార్చి 12న జరగాల్సి ఉంది. మరోవైపు నీట్ 2022 నిర్వహణ విషయమై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్‌లో  కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. అయితే ఈలోపే నీట్ వాయిదా వేస్తున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. నీట్ పీజీ 2022 పరీక్ష తేదీలను తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS).. NEET PG exam నిర్వహిస్తుంది. ఈ ఏడాది మార్చి 12న పరీక్షను నిర్వహించాలని NBEMS నిర్ణయించింది. అయితే పరీక్షను వాయిదా వేయాలని NBEMSకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆరుగురు MBBS వైద్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిబంధనలలో నిర్దేశించిన ఇంటర్న్‌షిప్ పీరియడ్‌ పూర్తి చేయడం వంటి అనేక పూర్తి చేయడానికి అనువుగా పరీక్షను వాయిదా వేయాలని కోరారు.