UP Election 2022:  ఉత్తరప్రదేశ్ క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ నామినేషన్ దాఖలు చేయడానికి ఆలస్యం కావడంతో బల్లియాలోని కలెక్టరేట్ కార్యాలయానికి పరుగెత్తారు.  

UP Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ప్ర‌ధాన పార్టీల ప్ర‌ధాన‌నేతలు ప్ర‌చారంలో బిజీబిజీ అయ్యారు. అదే త‌రుణంలో రాష్ట్రంలో నామినేష‌న్ల పర్వం జోరుగా సాగుతోంది. దాంతో ఎన్నిక‌ల బ‌రిలో దిగిన నేతలు అట్టహాసంగా.. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో యూపీలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. యూపీలో ఓమంత్రి నామినేషన్ వేసే సమయానికి ఆలస్యం అయ్యారు. దీంతో పరుగులు పెట్టారు. ఈ ఘటన యూపీలోని బల్లియా కలెక్టరేట్ వద్ద చోటుచేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీ నామినేష‌న్ దాఖలు చేయ‌డానికి బల్లియా కలెక్టరేట్ కు భారీ ఎత్తున ర్యాలీగా వెళ్తారు. చుట్టూ కార్యకర్తలు, నినాదాలు, మెడలో దండలతో ఎంతో కోలాహాలంగా ర్యాలీ సాగింది. అయితే ఆఫీసు గేటు వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి నామినేష‌న్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. కేవ‌లం మూడు నిమిషాలు మాత్ర‌మే మిగిలి ఉండ‌డంతో క్రీడా మంత్రి ఆ గేటు నుంచి ఆఫీసు నామినేష‌న్ హాల్‌లోకి ప‌రుగులు తీశారు. నిన్ననితో అక్కడ నామినేషన్ల గడువు ముగిసింది. నామినేషన్లు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసాయి.అయితే అప్పటికే టైం కావడంతో మంత్రిఉపేంద్ర తివారీ నామినేషన్ వేసేందుకు పరుగులు తీశారు. బీజేపీ టికెట్‌పై ఆయ‌న ఫేపెనా అసెంబ్లీ నుంచి పోటీ చేయ‌డానికి నామినేష‌న్ దాఖలు చేశారు.


ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నామినేషన్ ప్రక్రియ ముగియడానికి మూడు నిమిషాల సమయం ఉండగానే రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి తివారీ కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. బల్లియా జిల్లాలోని ఫెఫ్నా అసెంబ్లీ స్థానం నుంచి తివారీని భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.