ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో బీజేపీ యువ నాయకుడిపై కాల్పులు జరగడంతో అతడు మరణించాడు. రాష్ట్రంలో ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళనను రేకెత్తిస్తోంది. కాల్పుల్లో మృతి చెందిన నాయకుడు యూపీ భారతీయ జనతా యువమోర్చా జనరల్ సెక్రటరీగా పని చేస్తున్నారు. 

UP Election News 2022 : ఓ వైపు ఉత్తరప్రదేశ్ (uttar pradesh) అసెంబ్లీకి మూడో దశ ఎన్నికలు కొనసాగుతుండగా.. మరో వైపు ఆ రాష్ట్రంలోని హత్రాస్ (Hathras)లో కాల్పులు కలకరం రేపాయి. హత్రాస్ ప్రాంతంలో జ‌రిగిన కాల్పుల్లో బీజేపీ (bjp) నాయ‌కుడు కృష్ణ యాద‌వ్ (krishna yadav) త‌న ఇంట్లోనే హ‌త్య‌కు గురయ్యారు. 

కృష్ణ యాద‌వ్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ భారతీయ జనతా యువమోర్చా జనరల్ సెక్రటరీ (Bharatiya Janata Yuva Morcha General Secretary)గా ప‌ని చేస్తున్నారు. హత్రాస్ జిల్లాలోని సికంద్రౌ అసెంబ్లీలో నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఆయ‌న నివాసం ఉంటున్నారు. అయితే ఆదివారం రోజున ఆయ‌న త‌న ఇంట్లో ఉన్న రెండో అంత‌స్తులో కాల్పుల‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న అక్క‌డే మృతి చెందారు. 

ఈ ఘటనపై అధికారులు మీడియాతో వివరాలు పంచుకున్నారు. ‘‘ కృష్ణ అనే వ్యక్తిని బుల్లెట్‌తో కాల్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అతని నివాసానికి వెళ్లి పరిశీలించారు. అతని గదిలో రక్తపు మరకలు కనిపించాయి. అక్కడి నుంచి పిస్టల్, ఖాళీ కాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నారు ’’ అని ఓ అధికారి చెప్పారు. కాల్పుల్లో గాయ‌ప‌డిన కృష్ణ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో అత‌డిని చికిత్స కోసం అలీగఢ్‌లోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లార‌ని, అయితే అత‌ను అక్కడికి చేరుకునేలోపే మరణించార‌ని హత్రాస్ ఎస్పీ వినీత్ జైస్వాల్ తెలిపారు. పోస్టుమార్టం చేసి ఘటనపై విచారణ జరుపుతున్నార‌ని చెప్పారు. యువ రాజ‌కీయ నాయ‌కుడు హ‌త్య‌కు గుర‌య్యాడ‌ని తెలియ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు చేరుకున్నారు.