కర్ణాటక అసెంబ్లీలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఓ అజ్ఞాత వ్యక్తి సభలోకి ప్రవేశించి ఎమ్మెల్యే సీటులో కూర్చొన్నాడు. ఇతనిని కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు.. కట్టుదిట్టమైన భద్రత వుండే అసెంబ్లీలో భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఓ అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించి.. ఏకంగా శాసనసభ్యుడి సీట్లో కూర్చొన్నాడు. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఇది జరిగింది ఎక్కడో కాదు కర్ణాటక అసెంబ్లీలో. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సమయంలో విధాన సౌధలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మకు కేటాయించిన కుర్చీలో కూర్చొన్నాడు. కాసేపటికీ తేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతనిని కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అతను అనుమతి లేకుండా అసెంబ్లీలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. 

అసెంబ్లీలో అపరిచిత వ్యక్తిని గుర్తించిన జేడీఎస్ ఎమ్మెల్యే వెంటనే స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీని అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టుబడ్డ వ్యక్తికి 70 ఏళ్లు వుంటాయని సమాచారం. అసెంబ్లీ నుంచి ఈ వ్యక్తిని బయటకు పంపేందుకు భద్రతా అధికారులను లోపలికి ప్రవేశించారు. తాజా ఘటన కర్ణాటక అసెంబ్లీలో భద్రతా ఏర్పాట్లపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఘటన జరిగిన రెండు గంటల తర్వాత అధికారులు విచారణ చేపట్టారు. ఇకపోతే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 14వ సారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డుల్లోకెక్కారు. అంతేకాదు.. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్.