Parliament Special Session: పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ సమావేశాలకు సంబంధించిన అజెండాలో ముఖ్యమైన విషయాలు చర్చిస్తామని కేంద్రమంత్రి ప్రకటించకపోవడం మరో ఉత్కంఠ. ఇంతకీ అజెండాలో ముఖ్యమైన అంశాలేంటీ?
దేశ రాజకీయాలు వేడెక్కుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునిచ్చింది. అయితే.. ఈ సమయంలో సరైన ఎజెండా ప్రకటించకపోవడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సందర్భంగా రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయని కొందరూ.. ఒకే దేశం- ఒక ఎన్నికకు సంబంధించిన బిల్లు ప్రవేశపెడతారని మరికొందరూ.. లేదు విపక్షాలను ఇరుకునబెట్టే ఏమైనా సంచలన బిల్లులను తీసుకువస్తారేమోనన్న అనుమానాలను వెల్లడిస్తున్నారు.5 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది.
ఈ తరుణంలో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటు సమావేశాలపై కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ 18 నుండి నెంబర్ 22 వరకు పార్లమెంట్ స్పెషల్ సెషన్ సమావేశాలు నిర్వహించబోతున్నామని వెల్లడించారు. ఈ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన ఎజెండాలో ముఖ్యమైన అంశాలు ఉంటాయని, వాటిని సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. త్వరలో ఆ జెండాను అందరికీ తెలియజేస్తామని ఇందుకు చాలా సమయం ఉందని వెల్లడించారు. అయితే..ఆ ముఖ్యమైన అంశాలు ఏంటో.. ఆ అజెండా ఏంటో వెల్లడించడానికి ప్రహ్లాద జోషి నిరాకరించడం మరో ట్విస్ట్.
బిజెపి 9 ఏళ్ల పాలనలో ఎన్నడూ కూడా ఇలాంటి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించలేదు. ఇదే తొలిసారి కావడం విశేషం. అంతకు ముందు జీఎస్టీ అమలు చేయడానికి 2017 జూన్ 30న ప్రత్యేకంగా అర్థరాత్రి సమయంలో పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. అయితే.. ఈ సారి మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా పూర్తిస్థాయిలో లోక్సభ, రాజ్యసభలు వేర్వేరుగా ఐదు రోజుల పాటు సమావేశం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో అందరూ షాక్ గురయ్యారని చెప్పాలి.
