Arvind Kejriwal: జాతీయ స్థాయిలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) ను అమలు చేయడానికి 2024 కోసం బీజేపీ ఎదురుచూస్తోందా? అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. యూసీసీ ఎత్తుగడను గుజరాత్ ఎన్నికలతో ముడిపెట్టి ఆయన బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Gujarat Elections: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. గుజరాత్లో యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించి ప్యానెల్ ఏర్పాటు గురించి ఆయన ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శల దాడి కొనసాగించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలక పక్షం అదే వాగ్దానాన్ని చేసిందని, అయితే గెలిచిన తర్వాత దానిని విస్మరించిందని ఆరోపిస్తూ బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలను ఎత్తిచూపారు. "వారు (బీజేపీ) ఉత్తరాఖండ్ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసారు. అది ఇప్పుడు అదృశ్యమైంది" అని ఆయన అన్నారు. ఇదే సమయంలో గుజరాత్ ఎన్నికలకు రోజుల ముందు ఒక కమిటీని వేశారనీ, ఇది ఎన్నికల తర్వాత కూడా అదృశ్యమవుతుందని విమర్శించారు.
అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు మాట్లాడుతూ యూనిఫాం సివిల్ కోడ్-బీజేపీ తీరును విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వ ఉద్దేశంపై అనుమానం వ్యక్తం చేస్తూ, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీ అదే వాగ్దానాన్ని చేసిందన్నారు. అయితే, ఎన్నికల్లో గెలిచిన తర్వాత దానిని అమలు చేయలేదని ఆప్ చీఫ్ విమర్శించారు. "ఉత్తరాఖండ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.. కానీ వారు ఇంటికి తిరిగి వెళ్లారు" అని ఆయన అన్నారు. ఇప్పుడు గుజరాత్ లో అదే పనిచేస్తున్నారని ఆరోపించారు. భావ్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని 44వ అధికరణం ప్రకారం యూనిఫాం సివిల్ కోడ్ను రూపొందించాలనీ, అలా చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంగా చెబుతోంది. అయితే అది అన్ని వర్గాలతో చర్చలు, అభిప్రాయాల తర్వాత ప్రభుత్వ అనుమతితో జరగాలని అన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదు.. లోక్ సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారా? అని కేజ్రీవాల్ బీజేపీని ప్రశ్నించారు. ముస్లింలకు వివాదాస్పద అంశం, మత ఆధారిత చట్టాలను తొలగించే యూనిఫాం సివిల్ కోడ్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు బీజేపీ శుక్రవారం తెలిపింది. హిందువుల మెజారిటీ ఓట్లను చీల్చేందుకు చేసిన జిమ్మిక్కుగా కాంగ్రెస్ కూడా ఆరోపించింది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో ఉన్న తరహాలో అటువంటి చట్టాన్ని ఎలా అమలు చేయవచ్చో పరిశీలించడానికి గుజరాత్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీని ప్రతిపాదించింది. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని – రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం కమిటీని ఏర్పాటు చేశామని గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘవి తెలిపారు.
