పెళ్లయిన మహిళలకు భర్తలు, అత్తింటి వేధింపుల నుంచి రక్షించేందుకు కల్పించిన గృహ హింస చట్టంపై మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యపై తప్పుడు కేసు పెట్టడానికి వారిలాగా భర్తల కోసం గృహ హింస చట్టమంటూ ఒకటి లేకపోవడం దురదృష్టమంటూ అభిప్రాయపడింది

పెళ్లయిన మహిళలకు భర్తలు, అత్తింటి వేధింపుల నుంచి రక్షించేందుకు కల్పించిన గృహ హింస చట్టంపై మద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భార్యపై తప్పుడు కేసు పెట్టడానికి వారిలాగా భర్తల కోసం గృహ హింస చట్టమంటూ ఒకటి లేకపోవడం దురదృష్టమంటూ అభిప్రాయపడింది. మంగళవారం శశికుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2015లో శశికుమార్ పై అతడి భార్య సేలంలోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ అదనపు మహిళా కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. ప్రతిగా తన భార్యే తనను చిత్రహింసలు పెట్టిందని, తనను వదిలేసి వెళ్లిపోయిందంటూ ఫస్ట్ అడిషనల్ సబ్ జడ్జికి శశికుమార్ ఫిర్యాదు చేశారు. విడాకులు రావడానికి నాలుగు రోజుల ముందు యానిమల్ హస్బెండ్రీ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టర్‌కూ తన భర్తపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. దీంతో ఆయన శశికుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ 2020 ఫిబ్రవరి 28న ఉత్తర్వులిచ్చారు. ఆ మరుసటి రోజే శశికుమార్ దంపతులకు న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.

Also Read:కరోనా తెచ్చిన కష్టాలు.. నరకం చూస్తున్న మహిళలు

అయితే తన సస్పెన్షన్ ఆర్డర్ పై గత ఏడాది శశికుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు మంగళవారం విచారణకు రావడంతో జస్టిస్ వైద్యనాథన్.. ఈ వ్యవహారం పిటిషనర్ ను కావాలనే ఇబ్బందులకు గురిచేసినట్టుందని వ్యాఖ్యానించారు. విడాకులు వస్తాయని ముందే తెలిసీ ఆమె ఇలా ఫిర్యాదు చేసినట్టు అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. భార్యభర్తలు తమ అహాన్ని పాదరక్షల్లా చూడాలని, ఇంటి బయటే దానిని వదిలేసి రావాలని న్యాయమూర్తి సూచించారు. లేనిపక్షంలో దాని ఫలితాన్ని పిల్లలు అనుభవించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది పవిత్రమైన కార్యమన్న ఆయన.. తలపాగాను తీసేసినంత ఈజీగా బంధాన్ని తెంచుకోవద్దని సూచించారు. అయితే, సహ జీవనానికి హక్కు కల్పించిన గృహ హింస చట్టం 2005 అమల్లోకి వచ్చినప్పటి నుంచి ‘పవిత్రత’ అన్న పదానికి అర్థం లేకుండాపోయిందని అన్నారు. శశికుమార్ సస్పెన్షన్‌ను రద్దు చేసి 15 రోజుల్లోగా ఆయనను విధుల్లోకి తీసుకోవాలని యానిమల్ హస్బెండ్రీ డైరెక్టర్ ను జస్టిస్ వైద్యనాథన్ ఆదేశించారు.